గ్యాంగ్ రేప్ చేసి, యాసిడ్ తాగించి చంపేశారు
బరేలీ: ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి ఉరేసిన ఘటనను మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన, హీనమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా, 22 ఏళ్ల యువతిపై కొంత మంది సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెతో యాసిడ్ తాగించి, చివరకు గొంతు నులిమి చంపేశారు.
బరేలీకి సమీపంలోని బహేరీ ప్రాంతంలో గల ఐత్పురా గ్రామ పొలాల్లో బాధితురాలి శవం శనివారంనాడు కనిపించింది. ఆమె ముఖం మీద కూడా దుండగులు యాసిడ్ పోశారని తెలుస్తోంది. ఆమెపై తొలుత అత్యాచారం చేసి, తర్వాత గొంతు నులిమి చంపినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు అధికారులు సోమవారంనాడు తెలిపారు.
మృతురాలి కడుపులో యాసిడ్ కూడా ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. వాళ్లు బలవంతంగా ఆమె చేత యాసిడ్ తాగించి చంపినట్లు తెలిసిందని అధికారులు చెబుతున్నారు. ఆమె ముఖంపై యాసిడ్ పోసి, ఆమెను గుర్తించకుండా ఉండేందుకు పెట్రోలు పోసి దగ్ధం చేశారు. మృతురాలు ఉత్తరాఖండ్ వాసి కావచ్చునని భావిస్తున్నారు.
ఉత్తరాఖండ్కు పోలీసు బృందాన్ని పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర గౌర్ తెలిపారు. ఇది పరువు హత్య గానీ, అమ్మాయిలతో వ్యాపారానికి సంబంధించిన కేసు గానీ కావచ్చునని డిప్యూటీ ఎస్పీ బహేరి కలుసింగ్ అన్నారు.