కారులో తిప్పుతూ రాత్రంతా యువతిపై గ్యాంగ్ రేప్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణమైన సంఘటన జరిగింది. 20 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోల్కతా శివారులో ఐటీ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న సాల్ట్ లేక్ ప్రాంతంలో ఈ ఆ దారుణం చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో అల్పాహారం కోసం బయటకు వచ్చిన యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. నడుస్తున్న కారులోనే ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను స్థానిక బస్టాండ్ వద్ద వదిలివేశారు. సోమవారం బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను ఆ ప్రాంతంలో కాస్తా దారి మరిచానని, ఎటు వైపు వెళ్లాలంటూ ఓ వ్యక్తిని అడిగానని, తాను వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించానని, కొద్ది క్షణాల్లోనే ఓ కారు తన వద్దకు వచ్చి ఆగిందని, తనను నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులోకి లాక్కున్నారని, అందులో తనకు దారి చూపిన వ్యక్తి కూడా ఉన్నాడని యువతి పోలీసులకు వివరించింది.
తనను కారులో తిప్పుతూ తనపై పలుమార్లు ఆ వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేసింది. మర్నాడు తెల్లారి తనను ఓ బస్ స్టాప్ వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. ఓ టాక్సీ డ్రైవర్ ఆమెను చూసి స్థానిక పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్లాడు.
సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల గురించి, వారు వాడిన కారు గురించి కొంత సమాచారం తెలుసుకోలిగామని పోలీసులు చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని అంటున్నారు.