కావేరీ చిచ్చు: బిర్యానీ కోసం 42 వోల్వో బస్సులు కాల్చిన యువతి
బెంగళూరు: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరీ జలవివాదంపై నిరసనగా సెప్టెంబర్ 12వ తేదిన బెంగళూరు నగరంలోని ధ్వారకా నగర్ లో కేపీఎన్ ట్రావెల్స్ కు చెందిన 42 వోల్వో బస్సులు దహనం చేశారు.
కావేరీ జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గోంటే ప్లేటు బిర్యానీ, రూ. 100 ఇస్తామని ఆందోళనాకారులు చెప్పడం వలనే తన కుమార్తె సి. భాగ్య అలియాస్ భాగ్యశ్రీ (22) వారి వెంట వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు.
యాదగిరికి చెందిన భాగ్య బెంగళూరు చేరుకుని గిరినగర సమీపంలోని మురికివాడలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది. ఈమె దినకూలీగా పని చేస్తుంది. సెప్టెంబర్ 12వ తేదిన కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది.
తరువాత సాయంత్రం స్నేహితులు వచ్చి రూ. 100, బిర్యానీ ఇస్తామని చెప్పి భాగ్యశ్రీని పిలుచుకుని వెళ్లారని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. గిరినగర సమీపంలోని ధ్వారకా నగర్ లో తమిళనాడుకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ గ్యారేజ్ లో ఉన్న వోల్వో బస్సుల మీద పెట్రోల్ చల్లారు.
అక్కడ ఉన్న సిబ్బంది మీద పెట్రోల్ చల్లి నిప్పంటిస్తామని హెచ్చరించారు. తరువాత బస్సులకు నిప్పంటిస్తున్న సందర్బంలో అక్కడి సిబ్బంది మొబైల్ లో రికార్డు చేశారు. గ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆదృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఈ ఘటనలో 42 వోల్వో, స్లీపర్ కోచ్ బస్సులు బూడిద అయ్యాయి. పోలీసులు సీసీ కెమెరాలు, కేపీఎన్ ట్రావెల్స్ సిబ్బంది మొబైల్ లో రికార్డు చేసిన దృశ్యాలు పరిశీలించారు. కచ్చితమైన ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు.
అరెస్టు అయిన 11 మందిలో భాగ్య అలియాస్ భాగ్యశ్రీ ఉంది. బస్సుల దహనం కేసులో భాగ్య అలియాస్ భాగ్యశ్రీ ప్రమేయం ఉందని తమ విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు చెప్పారు.
ఆందోళనలు, బస్సుల దహనం కేసులో పోలీసులు 550 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో 11 మందిని అధికారికంగా అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.