రెండో పెళ్లికి భర్త రెడీ: మహిళ ఈమెయిల్తో బ్రేక్
చెన్నై: కెనడాలో ఉన్న ఓ మహిళ భర్తకు రెండో పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగనుందని తెలుసుకుని ఈ మెయిల్ ద్వారా బ్రేకులు వేయగలిగింది. తమిళనాడులోని తిరుచ్చి పోలీస్ కమిషనర్కు జస్ట్ ఈ-మెయిల్ కొట్టింది. అంతే పెళ్లి రద్దైపోయింది. ఈ సంఘటన తమిళనాడు తిరుచ్చిలో జరిగింది. శాంతి వాసన్, సీతలు ఇద్దరూ శ్రీలంక దేశస్థులని, ఉద్యోగం కోసం ఇద్దరూ కెనడా వచ్చారని వార్తలు వచ్చాయి.
అనుకోకుండా కెనడాలో కలిసిన వీరు పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలనూ కన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆమెను వదిలేసి తిరుచ్చిలోని మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకుంటానంటూ శాంతి వాసన్ చెప్పాడు. తనను, పిల్లలను వదిలి రెండో పెళ్లి ఎలా చేసుకుంటావో నేనూ చూస్తానంటూ సీత సవాల్ చేసింది.
ఆ తర్వాత భార్యాపిల్లలను కెనడాలోనే వదిలి శ్రీలంక వచ్చేసిన శాంతి వాసన్ ఆ తర్వాత తిరుచ్చి చేరుకుని మాజీ ప్రేయసిని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంతటితో సరిపెట్టుకుని ఉంటే బాగుండేదేమో, కాని సంఘమి తల్లిదండ్రులు తమ ఇంటి వద్ద సంప్రదాయ రీతిలో మళ్లీ పెళ్లి చేయాలని తీర్మానించారు.
సమాచారం అందుకున్న కెనడాలోని సీత శాంతి వాసన్ తనకు చేసిన మోసాన్ని తిరుచ్చి నగర పోలీస్ కమిషనర్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే స్పందించిన కమిషనర్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సీతతో సహజీవనం చేశానని, ముగ్గురు పిల్లలు కూడా తమకు ఉన్నారని శాంతి వాసన్ చెప్పడంతో పోలీసులు పెళ్లిని రద్దు చేశారు.