మామూలు లేడీ కాదు: 'అమెజాన్'కు రూ. 70లక్షలు టోపీ, ఎలానో తెలిస్తే షాక్!
స్థానికంగా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీలో పనిచేసే ఆమె.. ఆన్ లైన్ ప్రొడక్టులను తరుచుగా ఆర్డర్ చేస్తుండేది. అయితే దీని వెనకాల పెద్ద ప్లానే ఉంది.
బెంగుళూరు: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ను బెంగుళూరుకు చెందిన ఓ మహిళ బోల్తా కొట్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఉత్పత్తులు ఆర్డర్ చేసిన ప్రతీసారి.. నాణ్యత లేదంటూ వాటిని తిప్పి పంపించడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన అమెజాన్ సెల్లర్ సర్వీస్ దీనిపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
బెంగుళూరుకు చెందిన దీపాన్వితా ఘోష్ అనే వివాహిత దీని వెనకాల పెద్ద బాగోతమే నడిపినట్లు గుర్తించారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. దీపాన్వితా ఘోష్ (32) బెంగళూరు సమీపంలోని హొరమావు రాజన్న లేఔట్ లో తన భర్తతో కలిసి నివసిస్తోంది.
స్థానికంగా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీలో పనిచేసే ఆమె.. ఆన్ లైన్ ప్రొడక్టులను తరుచుగా ఆర్డర్ చేస్తుండేది. అయితే దీని వెనకాల పెద్ద ప్లానే ఉంది. వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకోవడం, తీరా అవి ఇంటికి డెలివరీ అయ్యాక నాణ్యత లేదన్న సాకుతో.. వాటి స్థానంలో వేరే నకిలీ వస్తువులను పెట్టి వెనక్కి పంపించడం మొదలుపెట్టింది.
అలా అత్యంత ఖరీదైన మొబైల్స్, కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలానే కొనుగోలు చేసింది. ఆర్డర్ చేసిన ప్రతీసారి తెలివిగా తన ఇంటి అడ్రెస్ ను మార్చేసేది. మొత్తం మీద ఇలా జరిగిన ప్రతీసారి అమెజాన్ ఆమెకు డబ్బులు చెల్లిస్తూ ఉండేది.
అయితే ఇటీవల దీనిపై సీరియస్ గా ఫోకస్ చేసిన సంస్థ ఆమె ప్లాన్ ను పసిగట్టింది. మొత్తం 104 ఆన్ లైన్ ఆర్డర్స్ ద్వారా రూ.70లక్షలు సంపాదించిందని సంస్థ అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమె కటకటాలపాలైంది.