ఒంటికి నిప్పంటించుకుని స్వామీజీని కౌగిలించుకున్న మహిళ: మృతి
బెంగళూరు: శరీరానికి నిప్పంటించుకున్న ఓ మహిళ మంటలు రేగుతుండగా స్వామీజీని కౌగిలించుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో మహిళ మరణించగా, స్వామీజీకి తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో స్వామీ శివానంద మఠంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద స్వామీజికి చెందిన మఠంలో ప్రధాన శిశ్యురాలిగా ఉంటున్న ప్రభావతితో స్వామీజీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
కాగా, మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలంటూ స్వామీజీని ఆమె డిమాండ్ చేస్తూ వచ్చిందని సమాచారం. ఇందుకు స్వామీజీ అంగీకరించకపోవడంతో తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రభావతి.. పూజలో నిమగ్నై ఉన్న స్వామీజీని కౌగిలించుకున్నట్లు తెలుస్తోంది.
80 శాతం కాలిన గాయాలతో ఉన్న బగల్కోటలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, నాలుగు దశాబ్దాలుగా స్వామీజీ మఠంలోనే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం ప్రభావతిని మఠంలో చేరిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.