7నెలల గర్భిణీకి విషం తాగించి చంపేశారు: అదనపు కట్నం కోసం అత్తింటివారి అరాచకం..
ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా యాసిడ్ తాగించి ఆమె హత్యకు కారణమయ్యారు.
విజయవాడ: దేశంలో లింగ వివక్ష నానాటికీ పెరిగిపోతూనే ఉంది. వరకట్న వేధింపులు.. ఆడపిల్లను కనవద్దంటూ హింసించడాలు మహిళల పాలిట శాపంగా మారాయి. తాజాగా పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ గ్రామంలో ఓ మహిళ పట్ల అత్తింటివారు అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన వెలుగుచూసింది.
అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్న అత్తింటివారు.. ఆమె కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలుసుకుని మరింత రెచ్చిపోయారు. ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా విషం తాగించి ఆమె హత్యకు కారణమయ్యారు.
అత్తింటివారికి క్రౌర్యానికి రుబీనా బీబీ అనే ఆ మహిళ బలైపోయింది. రుబీనా బీబీ 7నెలల గర్భవతి అని తెలియగానే స్థానిక స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లి ఆమె భర్త లింగ నిర్దారణ పరీక్షలు చేయించాడు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలియడంతో రూ.1.3లక్షల అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. అత్తింటివారంతా కలిసి ఆమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా వేధించారు.
అయితే వారి వేధింపులకు తలొగ్గని రుబీనా బీబీ అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరించింది. దీంతో భర్త, అత్తమామలు కలిసి రుబీనాకు బలవంతంగా విషం తాగించారు. ఆపై ఏమి తెలియనట్లు ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే రుబీనా ప్రాణాలు వదిలింది.
అదనపు కట్నం ఇస్తామని చెప్పినా.. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని రుబీనా తల్లిదండ్రులు వాపోతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.