‘ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్నావా?’ భర్త అనుమానం: భార్య, పిల్లల సజీవదహనం
ఓ మహిళకు వచ్చిన రాంగ్ కాల్.. ఆమెతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను బలితీసుకుంది. తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చిందని అనుమానించిన తాగుబోతు భర్త కారుణంగా ఈ ఘోరం జరిగింది.
చెన్నై: ఓ మహిళకు వచ్చిన రాంగ్ కాల్.. ఆమెతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను బలితీసుకుంది. తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చిందని అనుమానించిన తాగుబోతు భర్త కారుణంగా ఈ ఘోరం జరిగింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తెనకాశీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తెన్కాశిలో నివాసం ఉంటున్న ఇసక్క రవి, మహేశ్వరి(27) దంపతులకు షణ్ముగరాజ్(8), ధనశ్రీ(4) అనే పిల్లలున్నారు. మద్యానికి బానిస అయిన రవి.. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం తాగేసి వచ్చిన రవి.. భార్యతో గొడవ పడి వేరే గదిలో పడుకున్నాడు.
కాగా, మంగళవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మహేశ్వరి సెల్ఫోనకు ఓ కాల్ వచ్చింది. అది రాంగ్ కాల్ కావడంతో ఆ విషయాన్ని మహేశ్వరి అవతలి వ్యక్తులకు స్పష్టం చేసి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. పక్కగదిలో వున్న రవికి ఫోన్ రింగయిన శబ్దంతో మెలకువ వచ్చింది. భార్య ఉన్న గదిలోకి వచ్చేసరికి.. ఆమె సెల్ఫోన్లో మాట్లాడటాన్ని కోపంతో ఊగిపోయాడు.
ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్నావా? అంటూ ఆమెను బూతులు తిట్టాడు. అది రాంగ్ కాల్ అని, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. మహేశ్వరి ఎంత నచ్చజెప్పినా అతను వినిపించుకోలేదు. ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెతో ఘర్షణకు దిగాడు రవి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్వరి.. భర్త స్నానానికి వెళ్లగానే.. నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ కుమ్మరించి, తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది.
ఇరుగుపొరుగువారు వారి అరుపులను విని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.