ఫ్రెండే: మహిళకు మత్తిచ్చి, రేప్ చేసి చంపేశాడు
కోయంబత్తూరు: కేరళలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 42 మహిళతో పురుగుల మందు కలిపిన కోలా ఇచ్చి తాగించి, అత్యాచారం చేసి చంపేశాడు. ఈ పనికి ఒడిగట్టింది ఆమె మిత్రుడే. ఈ సంఘటన కేరళలోని పొలాచి సమీపంలో జరిగింది.
స్పృహ తప్పి పడిపోయిన మహిళను అతను పొలాచి సమీపంలోని పూసరిపట్టి గ్రామంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళను స్థానికులు చూసి పొలాచి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఆరోగ్యం విషమించడంతో ఆమెను కోయంబతూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం ఉదయం తరలించారు. అయితే, ఆమె శుక్రవారంనాడు తుదిశ్వాస విడిచింది. కేరళలోని త్రిషూరు దుస్తుల దుకాణంలో ఆ మహిళ పనిచేస్తుండేదని, ఆమె 47 శశి అనే పెయింటర్ను పెళ్లి చేసుకుందని పోలీసులు చెప్పారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
త్రిషూరుకు చెందిన సిజోతో ఆమెకు స్నేహం ఏర్పడింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిన సిజో బాధితురాలి నుంచి నాలుగు సవరల బంగారు గొలుసు తీసుకున్నాడు పలనిలోని పాన్ బ్రోకర్ వద్ద ఆ గొలుసును తాకట్టు పెట్టానని, అక్కడికి వస్తే గొలుసును తీసుకుని ఇచ్చేస్తానని సిజో మహిళకు చెప్పాడు
రాబోయే ప్రమాదాన్ని ఊహించని మహిళ అతనితో బైకుపై పలని వెళ్లింది. పొలాచి చేరగానే అతను ఆమెకు పురుగుల మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను సిజో నిర్మానుష్యంగా ఉన్న పూసరిపట్టి గ్రామంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లాడు. ఆమెపై అతను అత్యచారాం చేసి, ఆమెపై దాడి చేశాడు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.