మహిళా లెక్చరర్ సజీవ దహనం: పెళ్లయినా..కన్నేసి..వేధించి..పెట్రోల్ పోసి!
ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలాగా మారిపోయాడు. తాను ప్రేమించిన మహిళా లెక్చరర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఈ ఘటన పట్ల స్థానికులు నిరసన ప్రదర్శనలకు దిగారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు.
పెట్రోల్ చల్లి..నిప్పింటించి..
మృతురాలి పేరు అంకిత పిసుడ్డె. 25 సంవత్సరాలు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగన్ఘాట్లో లెక్చరర్గా పని చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన విక్కీ నగ్రలె అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. నిజానికి విక్కీ వివాహితుడు. అతనికి ఏడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ.. .అంకితను వేధించడం మానలేదు. అదే సమయంలో అంకితకు పెళ్లి కుదరింది. దీనితో విక్కీ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3వ తేదీన కళాశాలకు వెళ్తోన్న అంకితను అడ్డుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఆమెపై చల్లి, నిప్పంటించాడు.
మెరుగైన చికిత్స అందించినా..
ఈ ఘటనలో అంకితకు 40 నుంచి 50 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వార్ధా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నాగ్పూర్లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనూప్ మరార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. కాలిన గాయాలు తిరగబెట్టాయని, ఫలితంగా- శరీరం మొత్తం సెప్టిక్కు గురైందని ఆయన పేర్కొన్నారు.
భగ్గుమన్న హింగన్ఘాట్..
అంకిత మరణంతో హింగన్ఘాట్ ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ..ఈ ఉదయం హింగన్ఘాట్లో ధర్నా చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. నిందితుడికి ఉరిశిక్షను విధించాలని నినదించారు. స్థానిక పోలీసు ఇనస్పెక్టర్ సత్యవీర్కు వినతిపత్రాన్ని అందజేశారు. కొన్ని గంటల పాటు స్థానికుల నిరసనలు కొనసాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు నిరసనగా హింగన్ఘాట్లోని కళాశాలలు బంద్ను పాటిస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ముంబైలో ఓ ప్రకటన విడుదల చేసింది. అంకిత చనిపోవడం తనను కలచి వేసిందని చెప్పారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టామని, అయినప్పటికీ.. ఆమెను బతికించుకోలేకపోయామని పేర్కొన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పారు.