ఘోరం: లాడ్జీలకు తిప్పుతూ 3ఏళ్లపాటు రేప్ చేశాడు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ మహిళపై మూడేళ్ల పాటు తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 53ఏళ్ల దుర్మార్గుడు. ఆమెను బెదరింపులకు గురి చేసి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చివరకు ధైర్యం చేసిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడు పరారయ్యాడు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలిది వాడా తాలూకా కాగా, నిందితుడు దిలీప్ శ్రీధర్ పాటిల్ పొరుగున ఉన్న పాలగఢ్ జిల్లా వాసాయ్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు రోజుకూలీగా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ఇటీవలే మరణించాడు. అతడు ఉన్నప్పటి నుంచే ఆమెపై నిందితుడి అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి.
దిలీప్ శ్రీధర్ పాటిల్ కూడా కూలీగానే పనిచేస్తున్నాడు.బాధితురాలు ఈ విషయం బయటపెడితే తామిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని భర్తకు చెబుతానంటూ అతడు బెదిరించేవాడు. భర్త మరణించిన తర్వాత కూడా అతడి అత్యాచార పర్వం కొనసాగింది. ఈసారి తన కోరిక తీర్చకపోతే పిల్లలకు చెబుతానని బెదిరించాడు.
ఎట్టకేలకు ఆమె ధైర్యం కూడగట్టుకుని పాటిల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్ల బట్టి నిందితుడు అకోలి, వజ్రేశ్వరి ప్రాంతాల్లోని వివిధ లాడ్జీలకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.