పెళ్లాడతానని ఐఏఎస్ అధికారి రేప్ చేశాడు: విక్టిమ్

బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విషయంలో బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడైన ఐఏఎస్ అధికారి బిబి మొహంతి, బాధితురాలి మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. భరత్పూర్, గోవా, చెన్నై, అగ్రాలలోని హోటళ్లలో ఆ ఐఏఎస్ అధికారితో కలిసి బస చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని, వాటిపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఆధారాల కోసం ఇప్పటికే భరత్పూర్, ఉదయ్పూర్లకు ఓ బృందం వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. గోవా, అగ్రా ఇతర ప్రాంతాలకు కూడా బృందాలు వెళ్లనున్నట్లు తెలిపారు. నిందితుడు తన అధికారాన్ని ఉపయోగించి తనకు హాని చేసే అవకాశం ఉన్నందున భద్రత కల్పించాలని బాధితురాలు తన న్యాయవాది ద్వారా పోలీసులను కోరింది. కేసుకు సంబంధించిన వివరాలను కూడా తనకు తెలియజేయాల్సిందిగా ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
ఇది ఇలా ఉంటే.. తన భర్త అమాయకుడని, అతనికి ఏమి తెలియదని బిబి మొహంతి భార్య మీతా మొహంతి మీడియాకు తెలిపారు. ఇదంతా ఆ యువతి చేసిన కుట్రేనని చెప్పారు. అవసరమైతే తన భర్త పోలీసుల ముందు హాజరవుతారని తెలిపారు. ఇప్పటి వరకు తమకు పోలీసుల నుంచి ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు.
అసత్య ఆరోపణలు రావడం పట్ల తన భర్త ఎంతో ఆవేదనకు గురవుతున్నారని మీతా పేర్కొన్నారు. వైద్యుల సలహాతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సమన్లు జారీ చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications