ఇది ప్రేమేనా?: చర్చిలో యువతిని నరికేశాడు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అమ్మాయిలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తనను ప్రేమించలేదనే కోపంతో ఓ దుర్మార్గుడు.. ఓ యువతిని నరికేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తమిళనాడులోని తుత్తుకూడి జార్జ్ రోడ్డులో ఇందిరానగర్కు చెందిన ఫ్రాన్సీనా(24) ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. బుధవారం చర్చిలో ప్రార్థన చేస్తుండగా కీనన్ అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
తన ప్రేమను తిరస్కరించిన కారణంగా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, మరో నెల రోజుల్లో ఫ్రాన్సీనా వివాహం జరగనుండగా ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఫ్రాన్సీనాను హత్య చేసిన అనంతరం నిందితుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మహిళల రక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ టెక్కీ స్వాతి హత్య తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలో చోటు చేసుకోవడంపై ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.