హెల్మెట్ లేదంటూ యువకులపై విరుచుకుపడిన మహిళ ఎస్ఐ: ఏం చేసిందంటే..
తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేకుండా ఇద్దరు యువకులను ఓ మహిళా ఎస్ఐ చితకబాదింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు హైవేలో చోటు చేసుకుంది.
బెంగళూరు: తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేకుండా వెళుతున్న ఇద్దరు యువకులను ఓ మహిళా ఎస్ఐ చితకబాదింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు హైవేలో చోటు చేసుకుంది. మద్దూరు సమీపంలోని సోమనహళ్లి గ్రామం వద్ద మహిళా ఎస్ఐ సావి, ఇతర పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో నరసింహ, నిషాంత్ అనే ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా మోటార్ బైక్పై వచ్చారు. దీంతో, హెల్మెట్ లేకుండా ఉన్న వారిపై ఆమె విరుచుకుపడింది. అందులో ఒక యువకుడి కాలర్ పట్టుకుని అతని చెంపలు వాయించేసింది.
అనంతరం వారిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి.. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారంటూ వారిపై కేసు నమోదు చేసింది. కాగా, బాధిత యువకులు మాత్రం తాము జరిమానా చెల్లించినప్పటికీ మహిళా ఎస్ఐ తమను దూషిస్తూ, చేయి చేసుకున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, వాహనాల తనిఖీ సమయంలో ఆ యువకులపై ఆమె ప్రవర్తించిన తీరును అక్కడ ఉన్న వారు తమ సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది. దీంతో సదరు మహిళా ఎస్ఐపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని, ఎస్ఐ సావి తప్పు చేసినట్టు తేలితే ఆమెపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.