ఆ తాగుబోతు ఆకతాయికి చుక్కలు చూపించిన యువతి... నడిరోడ్డుపై తుక్కు రేగ్గొట్టింది...
ఆడవాళ్లు రోడ్డు మీద కనిపిస్తే చాలు కొంతమంది పోకిరీ బ్యాచ్లు రెచ్చిపోతుంటారు.వాళ్లను చూసి విజిల్స్ వేయడం,అసభ్యంగా సైగలు చేయడం,వెంటపడి వేధించడం చేస్తుంటారు. ఇలాంటి పోకిరీగాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక మహిళలు చాలా ఇబ్బందిపడుతుంటారు. అయితే పోకిరీగాళ్లు తామేం చేసినా మహిళలు సైలెంట్గా తలదించుకుని వెళ్లిపోతారనుకుంటే అది పొరపాటే. తిరగబడి వాళ్ల తుక్కు రేగ్గొట్టే మహిళలు కూడా ఉంటారు.తాజాగా మధ్యప్రదేశ్కి చెందిన ఓ యువతి ఓ తాగుబోతు ఆకతాయి తుక్కు రేగ్గొట్టింది.
రాజ్గఢ్కి చెందిన ఆ యువతి స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇటీవల ఓరోజు సాయంత్రం షాప్ మూసేసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. బస్టాండ్ సమీపంలో ఓ తాగుబోతు ఆమె స్కూటీకి అడ్డుపడ్డాడు. తప్పుకోవాలని చెప్పినా వినిపించుకోలేదు. పైగా ఆమెను లైంగికంగా వేధించేందుకు యత్నించాడు.దీంతో ఆ యువతికి తిక్క రేగింది. స్కూటీ నుంచి దిగి... కాలికి ఉన్న చెప్పు తీసి... నడిరోడ్డుపై అతన్ని చెడమడా వాయించేసింది. అప్పుడు గానీ సదరు తాగుబోతుకు తాగిన మైకం దిగలేదు.వెంటనే తప్పయిపోయిందని ఆమె కాళ్లా వేళ్లా పడ్డాడు.
అయినప్పటికీ ఆమె ఊరుకోలేదు.అందరి ముందు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.దీంతో చేతులు కట్టుకుని అతను క్షమాపణలు కోరాడు. చివరలో తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి ఆ యువతి అక్కడి నుంచి కదిలింది.'పల్లెటూరి పిల్ల అని తక్కువ అంచనా వేస్తున్నావేమో... నేను ఇండోర్ నుంచి వచ్చాను... జాగ్రత్త...' అంటూ అతన్ని హెచ్చరించి వెళ్లిపోయింది.
Recommended Video
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్లో 34,535,ఉత్తరప్రదేశ్లో 49,385,పశ్చిమ బెంగాల్లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.