నడిరోడ్డులో నగ్నంగా మహిళ తల నరికేశారు
గౌహతి: చేతబడులు చేస్తున్నదని, మంత్రాలు వేయ్యడం వలన గ్రామస్తులు అనారోగ్యానికి గురి అవుతున్నారని అనుమానిస్తూ 60 సంవత్సరాల మహిళను అతి దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డు మీద నిలబెట్టి తల నరికి ఊరేగించిన సంఘటన అసోంలో జరిగింది.
అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని బీమజులి అనే గిరిజన గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలోని స్థానిక దేవాలయంలో దేవుని ప్రతినిధిగా, ఆ గ్రామం అమ్మగా చలామణి అవుతున్న అనిమా రోఘంటి (35) అనే మహిళ స్థానిక గ్రామస్తులను రెచ్చగొట్టి ఒక మహిళను హత్య చేయించింది.
సోనిత్ పూర్ జిల్లా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సమద్ హుస్సేన్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ గ్రామంలో ఓరంగ్ (60) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె వలన గ్రామానికి చెడు జరుగుతున్నదని అనిమా రోఘంటి ప్రచారం చేసింది.
ఆమె చేతబడులు చేస్తున్నదని, మంత్రాలు వేస్తున్నదని, త్వరలో గ్రామం అల్లకల్లోలం అవుతుందని నమ్మించింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన 200 మంది గ్రామస్తులు ఓరంగ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఆమెను బలవంతంగా ఇంటి నుండి బయటకు లాక్కోని వచ్చారు.
ఆమెను నగ్నంగా తయారు చేసి కొట్టుకుంటు గ్రామం మద్యలోని సర్కిల్ దగ్గరకు తీసుకు వెళ్లారు. తరువాత నడిరోడ్డు మీద పదునైన ఆయుధంతో ఆమె తల నరికివేశారు. తలను ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తల, మొండెం ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులను రెచ్చగొట్టిన అనిమా రోఘంటి, ఆమె భర్త, అనిమా సోదరితో సహ 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం స్వాధీనం చేసుకున్ననారు. అసోం ప్రభుత్వం నిందితులు అందరిని అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఐదు సంవత్సరాలలో అసోంలో మూడనమ్మకాల కారణంగా 100 మందికి పైగా మహిళలు హత్యకు గురైనారు.