కేరళ నేత వివాదాస్పద వ్యాఖ్య: టికెట్ల కోసం మహిళల అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉండి ఇప్పుడు సీపీఐ తీర్ధం పుచ్చుకున్న కేరళకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేరళలో మహిళా కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికల్లో టికెట్లు పొందేందుకు కాంగ్రెస్ పెద్దల వద్ద బట్టలు విప్పారని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ఏకే ఆంటోనీ ప్రధాన అనుచరుల్లో ఒకరిగా పేరొందిన చెరియన్ ఫిలిప్ వ్యాఖ్యానించారు.
తన ఫేస్బుక్ ఖాతాలో "స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోలేకపోయిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఇదే పని చేసి కొందరు మహిళా కార్యకర్తలు టికెట్లను పొందారు" అని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, మహిళా సంఘాలుఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలతో దిగొచ్చిన ఆయన తన ఫేస్ బుక్లో మరో పోస్ట్ చేశారు.
"నేను మహిళలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. నేను ఎప్పుడూ వారిని గౌరవిస్తాను. మహిళలను అవమానిస్తున్న కొందరు నేతల తీరును మాత్రమే వేలెత్తి చూపాను" అని వివరణ ఇచ్చారు. మహిళల పట్ల తన వ్యాఖ్యలను విరమించుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ డిమాండ్ చేశారు.
చెరియన్ ఫిలిప్ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు బిందుక్రిష్ణ, షనిమోల్ ఉస్మాన్ హెచ్చరించారు.