ఇల్లు గడవడం కోసమే ఒళ్లు అమ్ముకుంటున్నారు: మహిళా మంత్రి
న్యూఢిల్లీ: సరోగసీ బిల్లుపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తనదైన శైలిలో స్పందించారు. మహిళలు తమ కడుపు నింపుకోడానికే తమ శరీరాలను అమ్ముకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు మేలు చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే వాటివల్ల లబ్ధిని పొందకుండా.. ఇలా చేయడం తగదని హితవు పలికారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరోగసీ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా కుటుంబాలు ఈ మహిళలతో వాళ్ల గర్భాలు అద్దెకు ఇచ్చేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా! అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని ఆమె ఎదురు ప్రశ్నించారుు. అంతేగాక, వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారని చెప్పారు.
జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అనుప్రియా పటేల్ అన్నారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది.
కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది. అయితే, దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అంటున్నారు.
అంతేగాక, అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని, నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లు థాయ్లాండ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాగా, అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్న అనుప్రియ పటేల్.. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని అంటున్నారు. ఇల్లు గడవడం కోసం అద్దె గర్భాన్ని మోయడం శరీరాన్ని అమ్ముకోవడమేనని, దీన్ని నివారించాల్సిందేనని స్పష్టం చేశారు.