ప్రపంచ మహిళలారా ఏకం కండి-సీజేఐ నోట మార్క్స్ నినాదం-న్యాయ వ్యవస్థలో 50శాతం మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
భారత న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 50 శాతం రిజర్వేషన్ మహిళల హక్కు అన్నారు.దేశంలోని లా కాలేజీల్లోనూ ఇలాంటి చర్యలు అవసరమన్నారు. 'న్యాయ వ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిన అవసరం ఉంది.ఇది వేల ఏళ్లుగా మహిళల అణచివేతకు సంబంధించిన విషయం.' అని పేర్కొన్నారు. తనతో పాటు సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన 9 మందికి మహిళా న్యాయవాదులు చేసిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు.
దేశంలోని కింది స్థాయి కోర్టుల్లో దాదాపు 30 శాతం మహిళలు జడ్జిలుగా ఉన్నారని... కానీ హైకోర్టుల్లో వారి సంఖ్య కేవలం 11.5శాతంగా ఉందని ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 11 నుంచి 12శాతంగా(నలుగురు) ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కేవలం 1.7 మిలియన్ల మంది మాత్రమే మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు.అందులోనూ కేవలం 2 శాతం మంది మాత్రమే బార్ కౌన్సిల్ ప్రతినిధులుగా ఉన్నట్లు వెల్లడించారు.దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు న్యాయ కళాశాల్లో 50 శాతం రిజర్వేషన్ డిమాండ్ చేసే హక్కు మహిళలకు ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రఖ్యాత తత్వవేత్త కారల్ మార్క్స్ పాపులర్ నినాదాన్ని సీజేఐ ప్రస్తావించారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ పిలుపునిస్తే.. ప్రపంచ మహిళలంతా ఏకమవ్వాలని... ఏకమైతే పోయేదేమీ లేదు సంకెళ్లు తెంచుకోవడం తప్ప సీజేఐ రమణ పిలుపునిచ్చారు.'75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మహిళలకు అన్ని స్థాయిల్లో 50శాతం రిజర్వేషన్ ఉండాలని ఎవరైనా ఆశిస్తారు.కానీ సుప్రీం కోర్టులో ఇప్పుడున్న 11శాతం మహిళా ప్రాతినిధ్యం సాధించడానికే మేము చాలా కష్టాలు పడ్డాం.' అని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కారణంగా మహిళలకు ప్రాధాన్యం లభించవచ్చునని... అయితే న్యాయవాద వృత్తి ఇప్పటికీ మహిళలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.జస్టిస్ ఇందిరా బెనర్జీ,జస్టిస్ హిమా కోహ్లి,జస్టి బీవీ నాగరత్న,జస్టిస్ బేలా ఎం త్రివేది సుప్రీం న్యాయమూర్తులుగా ఉన్నారు. చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 31న ఒకేసారి 9 మంది సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీం కోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు.2027లో జస్టిస్ బివి నాగరత్న సీజేఐగా నియమితులయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే భారతదేశ చరిత్రలో ఆమె తొలి సీజేఐగా చరిత్రలో నిలుస్తారు.