మత మార్పిడులపై అట్టుడికిన పార్లమెంటు: విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: మతమార్పిడులపై పార్లమెంటు మంగళవారంనాడు కూడా అట్టుడికింది. మతమార్పిడులపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చే వరకు సభను సాగనివ్వబోమని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు మత మార్పిడుల వ్యవహారంతో దేశాన్ని మోసం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లో మతమార్పిడుల వ్యవహారాన్ని తక్షణం ఆపేయాలంటూ ఆందోళన చేశాయి. ఆ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
రాజ్యసభలో ఛైర్మన్ పొడియం వద్దకు విపక్షాల సభ్యులు దూసుకువెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో ఛైర్మన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల జోరు తగ్గకపోవడంతో మళ్లీ మధ్యాహ్నాం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.
రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే రగడ నెలకొంది. మతమార్పిడి అంశంపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్న తీరును ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ పార్టీ ఎంపీలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా నిలువరిస్తానని గత వారం హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. మతమార్పిడుల అంశంపై బీజేపీ ఎంపీలు ఘర్షణలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఆ అంశంపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చకైనా బిజెపి సిద్ధమని ఆ పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను విరమించలేదు. దీంతో ఛైర్మన్ సభను మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనంటూ కాంగ్రెసు సభ్యులతో సహా ఇతర పార్టీల సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు.
అటు లోక్సభలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకు ప్రయత్నించాయి. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చచెప్పడంతో సభ్యులు వెనక్కి తగ్గారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.