సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు భారీ షాక్.. వీవీప్యాట్ల వివాదంలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు!
Recommended Video
న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను, వాటికి అనుసంధానించిన వీవీప్యాట్లలోని ఓట్లతో సరి చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఇప్పటికే ఎన్నికల సంఘం తోసిపుచ్చగా తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ తేల్చేసింది.
దాదాపు 25 శాతం ఓట్లను ఈ విధంగా సరి చూడాలని కోరుతూ గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ సుప్రీంకోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.
కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. ఈ దశలో జోక్యం చేసుకునేందుకు తగిన కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది.
నిజానికి ఓటరు తాను ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో సరి చూసుకోవచ్చు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి వీవీప్యాట్ అనే యంత్రాన్ని అనుసంధానం చేస్తారు. ఫలితంగా తాను ఓటు వేసిన గుర్తుకే ఓటు నమోదైనదీ, లేనిదీ ఓటరు గుర్తు పట్టవచ్చు.
ఈ వీవీప్యాట్ యంత్రాలను తొలిసారిగా గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఉపయోగించారు. ఆ తరువాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. దీని ద్వారా ఓటింగ్లో మోసాలు, తప్పులు జరిగాయో, లేదో కూడా తెలుసుకోవచ్చు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఆడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.