మమత vs కేంద్రం- సీఎస్ను పంపేది లేదన్న దీదీ- క్రమశిక్షణా చర్యలకు కేంద్రం రెడీ
ప్రధాని మోడీ వర్చువల్ మీట్కు హాజరుకాలేదన్న కారణంతో బెంగాల్ సీఎస్ను రీకాల్ చేసిన కేంద్రానికి సీఎం మమతా బెనర్జీ షాకిచ్చారు. ప్రస్తుత పరిస్దితుల్లో ఆయన్ను పంపేది లేదంటూ ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు. అసలు సీఎస్ రీకాల్ రాజ్యాంగ విరుద్ధమంటూ మోడీకి రాసిన లేఖలో మమత మండిపడ్డారు. అంతే కాదు గతంలో మీరు మా సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్కు మూడు నెలలు పొడిగింపు ఇచ్చారు కాబట్టి ఆయన ఇక్కడే కొనసాగుతారంటూ మమత స్పష్టం చేశారు.
బెంగాల్లో ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉందని, సీఎస్ ఆలాపన్ కరోనా నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్నారని, ఇలాంటి పరిస్ధితుల్లో ఆయన్ను ఢిల్లీకి పంపడం కుదరదని మమత తేల్చిచెప్పారు. దీంతో సీఎస్ ఆలాపన్ కేంద్రం కోరినట్లుగా ఇవాళ ఢిల్లీలో రిపోర్ట్ చేయడం లేదని తేలిపోయింది. దీంతో కేంద్రం తదుపరి చర్యలపై దృష్టిపెడుతోంది. కేంద్ర ఉద్యోగుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డీవోపీటీ ఆదేశాల మేరకు సీఎస్ ఆలాపన్ ఇవాళ ఢిల్లీలోరిపోర్ట్ చేయాల్సి ఉంది. మమత లేఖ నేపథ్యంలో ఆయన కోల్కతాలోనే ఉండిపోయారు.
మమత లేఖ తర్వాత సీఎస్ ఇవాళ ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. దీంతో ఆయన కేంద్రం ఆదేశించినట్లుగా ఉదయం 10 గంటలకు ఢిల్లీలో రిపోర్ట్ చేయలేదు. దీంతో సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్పై క్రమశిక్షణా చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల మేరకు ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మమత వర్సెస్ కేంద్రం పోరు మరింత ముదరబోతోంది. వాస్తవానికి సీఎస్ ఆలాపన్ ఇవాళ రిటైర్ కావాల్సి ఉండగా.. ఆయన పదవీకాలాన్ని ఈ మధ్యే మూడునెలలు పొడిగించిన కేంద్రం.. తాజా వివాదం నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Recommended Video