Work from home: ఐటీ కంపెనీలకు ఎలా చెబుతాం, కొన్ని నెలలు సేమ్ సీన్, డీసీఎం క్లారిటీ, పరిస్థితి !
బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే విధులు (వర్క్ ఫ్రమ్ హోమ్ ) నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తక్షణం వారివారి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలని చెప్పలేమని, అలా చెప్పడం సాధ్యంకాదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. కరోనా వైరస్ వ్యాధి (COVID-19) ఇంకా శాంతించలేదు, ఆ వైరస్ మహమ్మారికి విరుగుడుకు పరిష్కారం టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత ఐటీ కంపెనీలు ప్రారంభించాలని సూచిస్తామని, అంత వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంచిదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇంకా కొన్ని నెలల పాటు ఐటీ కంపెనీలు ప్రారంభించించే అవకాశం లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా వైరస్ మమహ్మరి దెబ్బతో 2020 మార్చి చివరి వారం నుంచి ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో వారివారి ఇళ్లకు, సొంత ప్రాంతాలకు పరిమితం అయ్యారు. అప్పుడు మూతపడిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం చాలా తక్కువ శాతం మంది ఉద్యోగులతో మాత్రమే వారి కార్యలాయాల్లో పనులు చేయిస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ఐటీ కంపెనీలు, చాలా వరకు కార్పోరేట్ కంపెనీలు నామమాత్రంగా కార్యాలయాలు తీస్తున్నాయి.
ప్రభుత్వానికి సూటి ప్రశ్న
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో చాలా ఐటీ కంపెనీలు ఇంత వరకు ప్రారంభం కాలేదని, వాటి పరిణామం చిరు వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్ల మీద పడుతోందని, అందు వలన వెంటనే ఐటీ కంపెనీలను ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పడే అవకాశం ఉందని, కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఏమిటో వెంటనే చెప్పాలని కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ విధాన సౌదలో కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాకు తెలుసు, ఇలాంటి టైమ్ లో ?
ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు ప్రారంభం అయితే కరోనా వైరస్ వ్యాధి వ్యాపించక ముందు ఎలా ఉండేదో అలాగే పరిస్థితి ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ గుర్తు చేశారు. ఐటీ కంపెనీలు ప్రారంభం అయితే ఆ ప్రాంతాల్లో ప్రజలు గుమికూడే అవకాశం ఉందని, ముందు పరిస్థితి ఎదురైతే కరోనా వైరస్ ఎక్కువ వ్యాపించే అవకాశం ఉందని, ఇలాంటి టైమ్ లో ఐటీ కంపెనీలు వెంటనే ప్రారంభించడం మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పరిష్కారం ఉంటేనే సాధ్యం
ప్రస్తుతం దేశంలో, కర్ణాటకలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ గుర్తు చేశారు. కరోనా వైరస్ విరుగుడుకు టీకాలు అందుబాటులోకి రావాలని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలని, తరువాత ఐటీ కంపెనీలు ప్రారంభించే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, అప్పుడు ఎప్పటిలాగే ఐటీ కంపెనీలు ప్రారంభం అవుతాయని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఐటీ కంపెనీలకు ఎలా చెబుతాం ?
ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలకు వెంటనే ప్రారంభించాలని ఆ కంపెనీల యాజమాన్యంకు ప్రభుత్వం కచ్చితంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు, ప్రస్తుతం ఐటీ కంపెనీలు వారి ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ కు పరిమితం చేశాయని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అన్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో బాగానే పని చేస్తున్నారని కొన్ని ఐటీ కంపెనీలు చెబుతున్నాయని డాక్టర్ అశ్వథ్ నారాయణ అన్నారు.
మార్చి వరకు సేమ్ సీన్ !
బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో ఉన్న ఐటీ కంపెనీలు, కార్పోరేట్ సంస్థలు వచ్చే ఏడాది మార్చి నెల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కు మగ్గు చూపుతున్నాయని తెలిసింది. మార్చి నెల వరకు ఐటీ కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంచిదని తాము అభిప్రాయపడుతున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవడిగోళ వాడిదే
ఐటీ కంపెనీలు మూతపడటంతో చిరు వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, కొంత మంది వ్యాపారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఐటీ కంపెనీలు ప్రారంభించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఐటీ కంపెనీలు తీసే అవకాశం లేదని కర్ణాటక ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది.