World blood donor day 2021: రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రక్తదాతలు తమ కర్తవ్యాన్ని విస్మరించట్లేదు. ఇదివరకు రక్తం మాత్రమే డొనేట్ చేసే వారు.. ఇప్పుడు ప్లాస్మా దానంపైనా ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న పేషెంట్కు చెందిన ప్లాస్మాతో ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరో రోగి ప్రాణాలను నిలిపే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఈ నెల 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ప్రకటించిన డే ఇది. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటోన్నాం.
18 నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న వారు రక్తదానం చేయవచ్చు. శరీర బరువు 50 కేజీలకు పైన ఉన్న ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి 450 మిల్లీ లీటర్ల వరకు రక్తం దానం చేయవచ్చు. పురుషులు ప్రతి మూడునెలలకోసారి మహిళలు ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేసే వీలుంది. రక్తదానం చేయడం వల్ల దీర్ఘకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని ఇనుము స్థాయిని సమతుల్యం చేయడానికి ఇది దోహదపడుతుంది. రక్తంలో ఇనుము శాతాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది. గుండెపోటు, కేన్సర్ వంటి ప్రాణాంతకాలకు దూరంగా ఉంచుతుంది.
తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొవ్వుశాతం సైతం తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. కేలరీలు, కొవ్వు పదార్ధాలు కరిగిపోవడానికి రక్తదానం ఉపయోగపడుతుంది. కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రెట్టింపు అవుతుంది. రక్తదానం చేయడం వల్ల కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తులు కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. క్రమం తప్పకుండా రక్తాన్ని దానం చేసే వారు బరువు తగ్గుతారు. ఊబకాయం ఉన్నవారు సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం. రక్త హీనతను ఎదుర్కొంటోన్న వారికి మరొకరి నుంచి రక్తాన్ని దానం చేయడం తప్ప అది మరో విధానంలో సాధ్యం కాదు. ప్రమాదాల సమయంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కించి ప్రాణాలను నిలుపుతుంటారు డాక్టర్లు. దీనికోసం బ్లడ్బ్యాంకులు వెలిశాయి. రెడ్క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీల వంటి అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థల ఈ రంగంలో పనిచేస్తోన్నాయి.