Year Ender 2020: కరోనా మేలు: ఊపిరిపీల్చుకున్న ప్రపంచం, జలంధర్ నుంచే హిమాలయాల కనువిందు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తొలి కేసు 2019 చివరలో చైనాలోని వూహాన్ నగరంలో నమోదైంది. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది మాత్రం 2020లోనే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనావైరస్ బారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ మహమ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ లక్షలాది మంది కరోనా బారినపడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
కాలుష్యాన్ని తగ్గించిన కరోనా..
ఇది ఇలావుంటే, కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యాన్ని రికార్డు స్థాయిలో తగ్గించడం గమనార్హం. ఈ మేరకు నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్-యూఎస్) కూడా తన పరిశోధనలో ఈ మేరకు తేల్చింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు షట్డౌన్, లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.
నాసా పరిశోధనల్లో తేలిన వాస్తవం..
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. కాలుష్యాన్ని పెంచే అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా నైట్రోజన్ డైఆక్సైడ్ సుమారు 20 శాతం తగ్గిందని నాసా తన పరిశోధనలో తేల్చింది. కాలుష్య కారకాలైన పరిశ్రమలు, వాహనాల రవాణా నిలిచిపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. సాధారణంగా ఉండే కాలుష్యం కంటే కూడా లాక్డౌన్ నిబంధనల కారణంగా తక్కువగా నమోదైందని తేల్చింది.
అందుకే కాలుష్యం తగ్గింది..
2018,2019 కంటే 2020లో కరోనా లాక్డౌన్ విధించడం వల్ల వాతావరణంలో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 50 నగరాల్లో నైట్రోజన్ డైఆక్సైడ్ సుమారు 20-50శాతం మధ్య తగ్గిపోయిందని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలు అమలు చేయడం కారణంగానే కాలుష్యం తగ్గిందని వెల్లడించారు.
పలు కీలక నగరాల్లో భారీగా తగ్గిన కాలుష్యం..
కరోనా తొలి కేసు నమోదైన చైనాలోని వూహాన్ నగరంలోనూ లాక్డౌన్ అమలు చేసిన కారణంగా అక్కడ గణనీయంగా కాలుష్యం తగ్గింది. సుమారు 60శాతం కాలుష్యం తగ్గింది. న్యూయార్క్ నగరంలో 45 శాతం వరకు కాలుష్యం తగ్గింది. ఇక భారతదేశంలోని న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ కాలుష్యంగా రికార్డు స్థాయిలో తగ్గింది.
జలంధర్ నుంచి హిమాలయాలు కనిపించేంత స్వచ్ఛత..
కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా భారతదేశంలో ఊహించని విధంగా కాలుష్యం తగ్గింది. గాలి కలుషిత రహితం కావడంతో అద్భుతాలు జరిగాయి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రజలు నేరుగా హిమాలయ పర్వతాలు వీక్షించారంటే కాలుష్యం ఏమేర తగ్గిందో చెప్పవచ్చు. కాలుష్యం కారణంగా ఇప్పటి వరకు కనిపించని హిమాలయాలు కనిపించడంతో.. తమకు హిమాలయాలు ఇంత దగ్గరగా ఉన్నాయా? అని జలంధర్ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే, ప్రస్తుతం క్రమంగా లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేస్తుండటంతో మళ్లీ కాలుష్యం పెరిగిపోతోంది. కాగా, కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఆరు నెలలపాటు ప్రపంచం స్వచ్ఛమైన గాలి పీల్చిందని చెప్పవచ్చు.