Year Ender: కరోనాపై పోరుకు దేశీ టీకాలు... ప్రస్తుతం ఏ టీకా ఏ దశలో ఉందంటే...
యావత్ ప్రపంచాన్ని ఆరోగ్య సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు,ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్లోనూ దేశీయంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తున్నాయి. ఇందులో భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్,సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్,జైదుస్ క్యాడిలా అభివృద్ది చేస్తున్న జైకోవ్-డి ఉన్నాయి.
Recommended Video
కోవ్యాగ్జిన్.. ఇప్పుడు ఏ దశలో...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాగ్జిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నట్లు భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ ప్లాంట్ను సందర్శించి వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించారు. కోవ్యాగ్జిన్ను ఎమర్జెన్సీ వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇటీవలే భారత్ బయోటెక్ డీసీజీఐ అనుమతి కోసం కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతులు పొందాలంటే క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి మరింత డేటాను సమర్పించాలని డీసీజీఐ భారత్ బయోటెక్కు స్పష్టం చేసింది.
జైదుస్ క్యాడిలా... మూడో దశ ప్రయోగాల్లో..
అహ్మదాబాద్కి చెందిన ఫార్మా దిగ్గజం జైదుస్ క్యాడిలా అభివృద్ది చేస్తున్న జైకోవ్-డి ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 250 మంది వాలంటీర్లపై మూడో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు జరపనున్నారు. 1048 మంది వాలంటీర్లపై టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరపగా.. మంచి ఫలితాలు వచ్చాయని ఇటీవలే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ షర్విల్ పటేల్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు సులభమైన సురక్షితమైన మార్గాన్ని కనిపెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్...
బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా కంపెనీతో కలిసి బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివవర్సిటీ కోవీషీల్డ్ను సంయుక్తంగా అభివృద్ది చేసింది. కమర్షియల్గా కోవిషీల్డ్ అని పిలవబడుతున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్లో మూడో దశ ప్రయోగాల్లో ఉంది. అంత సవ్యంగా సాగితే.. ఏడాది చివరి నాటికి సీరమ్ ఇన్స్టిట్యూట్ భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
1 బిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికై ఇప్పటికే ఆస్ట్రాజెనెకా సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎమర్జెన్సీ వినియోగ అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. అయితే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి మరింత డేటా అవసరమని... ఆ డేటాను పరిశీలించాకే అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని డీసీజీఐ స్పష్టం చేసింది.
మొదట ఆరోగ్య కార్యకర్తలకే వ్యాక్సినేషన్
భారత్లో నోవావ్యాక్స్,స్పుత్నిక్ వి తదితర వ్యాక్సిన్లు కూడా ప్రయోగాల దశలో ఉన్నాయి. యూకెలో ఇప్పటికే ఎమర్జెన్సీ వినియోగం కోసం అనుమతి పొందిన ఫైజర్... భారత్లోనూ ఎమర్జెన్సీ వినియోగానికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. మొదట ఏ వ్యాక్సిన్కు అనుమతి లభించినా.. ఆరోగ్య కార్యకర్తలు,పోలీసులు,సాయుధ బలగాలు,హోమ్ గార్డులు,డిజాస్టర్ మేనేజ్మెంట్ వాలంటీర్స్,మున్సిపల్ వర్కర్స్,50ఏళ్ల పైబడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని మంగళవారం(డిసెంబర్ 8) నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆఫ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్(NEGVAC) ప్యానెల్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.