కర్ణాటక రిజల్ట్స్: గవర్నర్ను కలవనున్న యడ్యూరప్ప, గవర్నర్ ఏం చేస్తారు?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓటర్ల తీర్పుతో రాజకీయపార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయమై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతి పెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించింది. మంగళవారం నాడు రాష్ట్ర గవర్నర్ను బిజెపి నేత, మాజీ సీఎం యడ్యూరప్ప కలవనున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఓటర్లు ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి అవసరమైన సీట్లు రాలేదు. మరో వైపు కాంగ్రెస్, జెడి (ఎస్) మధ్య అవగాహన చర్చలు జరుగుతున్నాయి. జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడ సిద్దమైంది. ఈ విషయమై గవర్నర్ ను కలిసి వివరించనున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ఈ కీలకమైన పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని మాజీ సీఎం, బిజెపి నేత యడ్యూరప్ప కోరే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం నాడే బిజెపి నేత యడ్యూరప్ప గవర్నర్ ను కలవనున్నారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ బిజెపి నేత వాజ్బాయ్ వాలా ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ తరుణంలో గవర్నర్ ఏం చేస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హంగ్ దిశగా పలితాలు వెలువడితే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలుస్తారు. ఆ తర్వాత మెజారిటీని నిరూపించుకొనేందుకు సమయం ఇస్తారు. ఆ సమయం లోపుగా మెజారిటీని నిరూపించుకోకపోతే ఇతర పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు.అయితే కర్ణాటకలో చోటుచేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఏం చేస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.