యడ్యూరప్ప వ్యాఖ్యల దుమారం .. దేశ వ్యాప్తంగా బీజేపీ పై విమర్శల వర్షం
పాకిస్థాన్లో ఉగ్రవాదులు శిబిరాలపై భారతదేశం వేసిన ముందడుగు కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని కర్ణాటక బిజెపి చీఫ్ బి ఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని, కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోకసభ స్థానాలలో ఇరవై రెండు స్థానాలలో బిజెపి విజయకేతనం ఎగరవేయడానికి ఈ సర్జికల్ స్ట్రైక్ కారణమవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సైతం సర్జికల్ స్ట్రైక్ కు, ఎన్నికలకు ముడిపెట్టి యడ్యూరప్ప చేస్తున్న రాజకీయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సర్జికల్ స్ట్రైక్ కు ఎన్నికలకు లింక్ పెట్టి వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్పపై విమర్శల వెల్లువ
చిత్రదుర్గ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ భూభాగం లోకి ప్రవేశించి భారత ప్రభుత్వం మూడు తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలను ఇది తెచ్చిపెట్టిందని, దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో తప్పక ఉంటుందని యడ్యూరప్ప పేర్కొన్నారు. తాజాగా యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల లో 40 మంది భారత సైన్యాన్ని కోల్పోయిన భారతదేశం ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానిని రాజకీయాలతో లింకు పెట్టడం సమంజసం కాదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకపక్క దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటే మరోపక్క యడ్యూరప్ప కు లోక్సభ ఎన్నికల గుర్తు వస్తున్నాయని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ వంటి జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రతిపక్ష పార్టీల నాయకులు , నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రతిపక్షాలకు యడ్యూరప్ప వ్యాఖ్యలే ఆయుధం .. సోషల్ మీడియా లో నెటిజన్ల ఫైర్
యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలకు మరో కొత్త ఆయుధం ఇచ్చినట్లయింది. మొత్తానికి సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ వెనుక ఎన్నికల వ్యూహం ఉందని బిజెపి పార్టీ నాయకుడు యడ్యూరప్ప నే ప్రకటించారని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాల లో భాగంగా ఈ తరహా వ్యూహాలతో భారత సైన్యం ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ వల్ల భారత్, పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉందని, యుద్ధం జరిగే అవకాశం కూడా లేకపోలేదని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి తలనొప్పిగా మారిన యడ్యూరప్ప వ్యాఖ్యల రగడ
ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సర్జికల్ స్ట్రైక్ తో చాలా సానుకూల దృక్పథం దేశంలో వచ్చిందని యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీ సైతం తలనొప్పిగా మారాయి. రానున్న ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో 22 లోకసభ స్థానాలు గెలుచుకోవడానికి ఈ సర్జికల్ స్ట్రైక్ సహకరిస్తుందని యడ్యూరప్ప మాట్లాడడం అటు ప్రతిపక్ష పార్టీలలోనే కాదు ఇటు సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహావేశాలకు కారణమవుతుంది. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా యడ్యూరప్ప పై, బిజెపి ప్రభుత్వం పై విమర్శల వర్షం కురుస్తుంది.