యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: బీజేపీకి దేవేగౌడ సూటి ప్రశ్న, 'రేపు కుమారస్వామి ప్రమాణం'
బెంగళూరు: సుప్రీం కోర్టులో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగలడంతో కాంగ్రెస్ నేతలు బీజేపీపై, కర్ణాటక గవర్నర్ పైన మండిపడుతున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు. అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులాంటిదన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదన్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
ఆ పేర్లు బీజేపీ బయటపెట్టలేదు
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జేడీఎస్ అధినేత హెచ్డి దేవేగౌడ అన్నారు. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారని, గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వలేదని చెప్పారు. 104 మంది ఎమ్మెల్యేల పేర్లు తప్ప మద్దతిచ్చే వారి పేర్లు బీజేపీ బయటపెట్టలేదన్నారు. కొత్తగా బీజేపీకి ఎవరు కూడా మద్దతివ్వరని దేవేగౌడ వెల్లడించారు. రేపు బలపరీక్షలో తమదే గెలుపు అన్నారు.
మాకు బలం ఉందని చెప్పినా అవకాశమివ్వలేదు
కాంగ్రెస్, జేడీఎస్లకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గులాం నబీ ఆజాద్ తెలిపారు. తమకు బలం ఉందని చెప్పినా గవర్నర్ అవకాశమివ్వలేదన్నారు. గోవా, మణిపూర్లలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వలేదని, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమిలకే అవకాశమిచ్చారని తెలిపారు.
కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ లేదు
కర్ణాటకలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని ఆజాద్ అన్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు రెండు వారాల గడువు ఎప్పుడూ ఇవ్వలేదని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. సుప్రీం ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదన్నారు. చట్టాలకు విరుద్ధంగా గవర్నర్ బీజేపీకి అవకాశమిచ్చారన్నారు.
ఇది చారిత్రాత్మక తీర్పు
అత్యధిక సీట్లు గెలిచిన వారికి అవకాశమివ్వాలని చెబుతున్నారని, కానీ గోవా, మణిపూర్లలో తమకు అవకాశమివ్వలేదని సిద్ధరామయ్య చెప్పారు. వారు 104 మంది ఎమ్మెల్యేల పేర్లు తప్ప ఇతర ఎమ్మెల్యేల పేర్లు చెప్పలేదన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది చారిత్మాత్మ తీర్పు అన్నారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తమకు సరైన బలం ఉందని కర్ణాటక ఎమ్మెల్సీ బస్వరాజ్ అన్నారు. కుమారస్వామి రేపు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. బీజేపీకి బలం లేదని చెప్పారు.