అందుకే రాహుల్ను ‘పప్పు’ అంటారు: యోగి ఆగ్రహం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలు చేయటం వల్లనే రాహుల్ను అందరూ పప్పు అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్ సంస్థలో మహిళలపై వివక్ష చూపుతున్నారని, ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎక్కడా స్కర్ట్స్ (నిక్కర్లు) ధరించిన మహిళలే కానరారంటూ ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి తీవ్రంగా స్పందించారు.
రాహుల్ నోటి వెంట వచ్చే అలాంటి మాటలే ఆయన పరిపూర్ణత సాధించలేదనటానికి నిదర్శనమని ప్రజలు భావించి 'పప్పు' అని అంటున్నాని అన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్లోని వల్సాడ్లో జరిగిన సభలో మాట్లాడారు.
అంతేగాక, రాహుల్ గాంధీ వెళ్లిన ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తథ్యమన్నారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మాటలు అసభ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు.