అయోధ్య రామాలయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ అవే..యోగి సంచలనం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిందని ఇప్పుడు తమ దృష్టి కాశీ విశ్వనాథ ఆలయం, మధురలోని ఆలయాల పైన ఉందని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అయోధ్య రామ మందిరం తర్వాత కాశీ, మధుర లను చూస్తుందని వాటిని బ్రహ్మాండంగా నిర్మించడం పైన తమ దృష్టి కేంద్రీకృతమైంది అన్నారు.
జ్ఞాన్ వాపి మసీదు, మధురలోని షాహి ఈద్గా మసీదు విషయంలో సీఎం యోగి
వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు, మధురలోని షాహి ఈద్గా మసీదు వివాదాస్పద నిర్మాణాలను ప్రస్తావించిన ప్రశ్నకు సమాధానంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తో బస్ ఝాంకీ హై కాశీ, మధుర అభి బాకీ హై అనే ప్రసిద్ధ నినాదాలు ఉదహరించి మేము అన్ని ప్రాంతాలకి చేరుకుంటామని, ఇప్పటికే చేరుకున్నామని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేశారు.

జ్ఞానవాపి మసీదు, షాహి ఈద్గా మసీదు వివాదాలు
ఏ సమాజమైనా దాని వారసత్వం పట్ల గర్వంగా భావించాలని ఆ దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. ఇప్పటికే జ్ఞాన వాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయం ఉన్న ప్రదేశంలో ఔరంగజేబు ఆలయాన్ని కూల్పించి నిర్మించిన మసీదని వివాదం కొనసాగుతుండగా మరోవైపు షహీ ఈద్గా మసీదు శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురలో శ్రీకృష్ణుడి జన్మభూమి ఉన్న ప్రదేశంలో ఔరంగజేబు కాలంలోనే నిర్మించబడిందని దీనిపైన కూడా వివాదం కొనసాగుతుంది.
కోర్టులలో విచారణ
దీనిపైన కూడా కోర్టులో కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులలో ఇప్పటివరకు కొన్నిసార్లు సర్వేలు, వీడియోగ్రఫీ, ఏఎస్ఐ అధ్యయనాన్ని అనుమతించాయి. ఈ నివేదికల ఆధారంగా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత వీటిపైన తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రామజన్మభూమి పై సీఎం యోగి వ్యాఖ్యలు
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణాన్ని చేయడం తన రాజకీయ జీవితంలో ఒక ఐకానిక్ మూమెంట్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు ముందు వాస్తవాలు, ఆధారాలు సమర్పించామని ఆయన పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు.
తన పాలనలో పెద్ద విజయం ఇదే
ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమని, 8 ఏళ్లకు పైగా పార్టీ తనకు అక్కడ సేవ చేయడానికి అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. తన పాలన సమయంలో 500 సంవత్సరాల తర్వాత శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణం అన్నింటిలోకి అతి పెద్ద విజయమని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications