యూపీలో ఓవైపు వరదలు-మరోవైపు కరవు-ఎన్నికల వేళ యోగీ ఆదిత్యనాథ్ ఆందోళన..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పుడు వాతావరణ పరిస్ధితులు అక్కడి బీజేపీ సర్కార్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవైపు వరదలతో అతలాకుతలం అవుతుంటే, మరోవైపు కరవు పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీంతో ఈ వాతావరణం ఏంట్రా బాబూ అని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తలపట్టుకుంటున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో రాష్ట్రంలో వాతావరణ పరిస్ధితులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయి.
రాష్ట్రంలో వరదల బారిన పడిన ఫరూఖాబాద్, కస్గంజ్, షాజహాన్పూర్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఏరియల్, ఆన్గ్రౌండ్ సర్వేలు నిర్వహించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. తాజా వరదలకు రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని 721 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఓవైపు వరదలు, మరోవైపు కరువు నెలకొందని, ఈ వింత పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని ఫరూఖాబాద్లో సీఎం యోగీ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్లో 12 జిల్లాలు సగటు కంటే ఎక్కువ వర్షపాతం, 26 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 22 జిల్లాలు సగటు కంటే తక్కువ వర్షపాతం, 15 జిల్లాలు దాదాపుగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు.తాజా పరిస్థితులతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,101 పునరావాస కేంద్రాల్ని, 1,504 వరద పోస్టులను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు చికిత్స చేయడానికి 2 వేలకు పైగా వైద్య బృందాలు ఏర్పాటు చేశారు.
వరదల విషయంలో ప్రభుత్వం చాలా ముందుగానే అప్రమత్తంగా ఉందని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. వరద సంసిద్ధత చర్యల్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫరూఖాబాద్లో గంగా, రామగంగ నదుల వరదల కారణంగా 116 గ్రామాలు ప్రభావితమయ్యాయని, జిల్లాలో సుమారు 80 వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారని యోగీ తెలిపారు. ఫరూఖాబాద్లో ఇరవై రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.












Click it and Unblock the Notifications