'ఇదీ యోగి ఆదిత్యనాథ్! మాయావతి గెలవలేక ఏదేదో అంటున్నారు'
ఢిల్లీ: 2019 ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధి అజెండాతో కాకుండా మతప్రాతిపదికన ఓటర్లను విభజించడం ద్వారా గెలవాలని చూస్తోందని, అందుకు ఆరెస్సెస్ వాది అయిన యోగి ఆదిత్యనాథ్ను సీఎం చేయడమే నిదర్శనం అన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పార్టీల నేతలే ఈ తరహా ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యూపీ ప్రజలు ఇచ్చిన తీర్పును వారు గౌరవించాలని, ఎన్నికల్లో తమ ఓటమిని హూందాగా అంగీకరించాలని సూచించారు.
ఇదీ ఆదిత్యనాథ్
అయిదుసార్లు ఎంపీగా గెలుపొందిన యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం సరైనదేనని వెంకయ్య అన్నారు. యూపీ అభివృద్ధి సాధిస్తే భారత్ అభివృద్ధి చెందినట్లేనన్న ప్రధాని మోడీ ప్రకటనలోని స్ఫూర్తి ఆదిత్యనాథ్కు తెలుసునని చెప్పారు.
అతను కులాలకు అతీతుడు అని వివరించారు. నీ, దురదృష్టవశాత్తు కొందరు అతనికి కులాన్ని ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ సేవ కోసం 22 ఏళ్ల క్రితమే కుటుంబాన్ని వదులుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ అన్నారు.
అందరితో కలసి.. అందరి వికాసానికి కృషి చేస్తానని యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. అవకాశం ఇవ్వకుండానే అలాంటి వ్యక్తిపై నిందలుమోపటం భావ్యం కాదన్నారు.
ఆరెస్సెస్ ప్రమేయం లేదు
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక వెనుక ఆరెస్సెస్ ప్రమేయం లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బీజేపీ శాసనసభా పక్ష నేతల ఎన్నికల్లో ఆరెస్సెస్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు.
పార్లమెంటరీ పార్టీ బోర్డు పరిశీలకుని సమక్షంలో శాసనసభ్యులే తమ నేతను ఎన్నుకుంటారని, ఇది బీజేపీ అనుసరిస్తున్న విధానమని, ఈ ప్రక్రియలో ఆరెస్సెస్ జోక్యం చేసుకోవటం కానీ, ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరునైనా సూచించటం కానీ ఉండదని తేల్చి చెప్పారు.
నేనే పరిశీలకుడిగా ఉన్నాను..
శనివారం నాటి యూపీ బీజపీ శాసనసభ్యుల భేటీకి నేను పరిశీలకునిగా ఉన్నానని, యోగి ఆదిత్యనాథ్ పేరును తొలుత సురేశ్ ఖన్నా ప్రతిపాదించగా మరో తొమ్మిది మంది బలపరిచారని చెప్పారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ముక్తకంఠంతో అంగీకారం తెలిపారన్నారు. యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర పార్టీ ఆమోదించిందని, ఇందులో ఆరెస్సెస్, వీహెచ్పీల ప్రమేయం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఆరెస్సెస్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు.
దెబ్బతిన్న పార్టీ
కాగా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 403 సీట్లకు గాను బీజేపీ-మిత్రపక్షాలు 325, ఎస్పీ 47, బీఎస్పీ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్లే ఎస్పీ దెబ్బతిన్నది.
2012 ఎన్నికల్లో బీఎస్పీ 80 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఏకంగా 59 సీట్లు కోల్పోయింది. 2012లో అధికారంలో ఉన్న ఎస్పీ.. కాంగ్రెస్ కారణంగా బాగా దెబ్బతిన్నది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఘోరంగా దెబ్బతిన్నది. ఎస్పీ వంద స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వదిలేసింది.
బీఎస్పీ, ఎస్పీలకు ఓట్ షేర్ కూడా తగ్గింది. ప్రజల తీర్పును ఎస్పీ స్వాగతించింది. కానీ బీఎస్పీ మాత్రం బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఆరోపణలు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. యూపీలో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే.. కేసుల నేపథ్యంలో మాయావతి బీజేపీకి మద్దతిచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే వార్తలు వచ్చాయి.