పోలీసుల్ని పరుగు పెట్టించిన యోగి: 'ఆమె' కోసం నిమిషాల్లో సీఎం స్పందన
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్నారు. లక్నోలో నిత్యం బిజీగా ఉండే హజ్రత్ గంజ్ పోలీసులను ఆశ్చర్యపరుస్తూ.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఈ ఉదయం తనిఖీకి వెళ్లారు.
అక్కడి రికార్డులు, నేరస్తులను ఉంచే గదులు, వాటిల్లోని సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలోని నేరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆకస్మిక తనిఖీతో పోలీసు వర్గాల్లో ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించింది.
దాదాపు అరగంట పాటు పోలీస్ స్టేషన్లో గడిపిన యోగి ఆదిత్యనాథ్ పోలీసులను పరుగులు పెట్టించారు.
యోగి హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నిమిషాల్లో స్పందించిన యోగి
కొందరు దుండగులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలను లైంగికంగా వేధించారని, తమ కుటుంబానికి రక్షణ కల్పించి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు యోగి వెంటనే స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

ఆ రోజు
హోలీ రోజున కల్యాణపుర ప్రాంతంలో స్థానిక యువకులు కొందరు ఓ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి తల్లీకూతుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అడ్డు వచ్చిన ఇంటి యజమానిపై దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అయితే కేసు విచారణలో అలసత్వం చూపుతున్నారని, తమకు సాయం చేయాలని బాధితుడు సీఎం కార్యాలయానికి, డీజీపీ కార్యాలయానికి ట్వీట్ చేశారు. దానికి సీఎం వెంటనే స్పందించారు.

నిందితులను పట్టుకునేందుకు..
యోగి ఆదేశాల మేరకు లక్నోలోని డీజీపీ ఆఫీసు నుంచి ఎస్పీ సచీంద్ర పటేల్కు ఫోన్ వచ్చింది. ఈ కేసును విచారించి వెంటనే నివేదిక సమర్పించాలనని ఆయనను ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని కలుస్తానని, వారికి వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు పటేల్ చెప్పారు. తొలుత నమోదు చేసిన కేసులొ కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్లా.. మహిళలకు రక్షణ కోసం యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత విషయంపై హామీ ఇచ్చారు. ఆయన చర్యలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తన మార్క్ పాలన
యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశాక.. తన మార్క్ పాలన సాగిస్తున్నారు. మంత్రులను, అధికారులను ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. గూండారహిత యూపీగా మార్చేందుకు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ దందాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి పోలీసులపై వేటు వేశారు.
బాధితులు తమకు న్యాయం జరగకుంటే తనకు ట్వీట్, ఇతర మార్గాల ద్వారా తెలియజేయాలని యోగి ఆదేశించారు. మహిళలను వేధించేవారి ఆట కట్టించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వ కార్యాలయా పాన్, గుట్కా మసాలాలను విడనాడాలని ఆదేశించారు. పశువధశాలలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రామాయన మ్యూజియానికి 20 ఎకరాలు కేటాయించారు.

ఆ ఫోటోలు తొలగించండి
ఇదిలా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ మంత్రుల ఫొటోలను తొలగించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మొహ్ సిస్ రజా ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఆఫీసు గదులు, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో, లేదో చూశారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, మాజీ మంత్రి ఆజాం ఖాన్ ఫొటోలు ఉండటాన్ని మొహ్ సిస్ రజా గమనించారు. వెంటనే, ఆ ఫొటోలను తొలగించాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications