పార్లమెంట్ ఓపెనింగ్ బాయ్ కాట్-విపక్షాల తీరుపై యోగీ ఆదిత్యనాథ్ విసుర్లు...
ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం కాబోతోంది. దీనికి దేశంలోని గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. అయితే కార్యనిర్వాహక వ్యవస్దకు అధిపతి అయిన ప్రధాని కాకుండా శాసన వ్యవస్ధల అధిపతి అయిన స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ లేదా రాష్ట్రపతి దీన్ని ప్రారంభించాలని విపక్షాలు కోరాయి. కేంద్రం ఒప్పుకోకపోవడంతో ఈ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించాయి.
విపక్షాల పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ బహిష్కరణ పిలుపుపై అధికార బీజేపీ మండిపడుతోంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా విపక్షాల తీరుపై మండిపడ్డారు. విపక్షాల తీరు అత్యంత బాధ్యతారాహిత్యమని యోగీ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రతిపక్షాల ప్రయత్నం అని ఆరోపించారు.

మే 28 స్వతంత్ర భారతదేశ చరిత్రకు అద్భుతమైన రోజని, ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేస్తారని యోగీ తెలిపారు. ఈ చారిత్రాత్మక రోజును మనోహరంగా, గర్వంగా మార్చడానికి బదులుగా కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రకటనలు జారీ చేస్తున్నాయని యోగీ ఆరోపించారు. ఇది బాధాకరం, బాధ్యతారాహిత్యం అని యూపీ సీఎం తన ట్విట్టర్ ప్రొఫైల్లో షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని మొత్తం దేశం ప్రపంచం ఎదురు చూస్తుండగా, ప్రతిపక్షాలు దానిని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని యోగీ విమర్శించారు. అలాంటి ప్రయత్నాలను ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని తెలిపారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ పదవీకాలంలో పార్లమెంట్ అనెక్స్, పార్లమెంట్ లైబ్రరీల్ని ప్రారంభించిన విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ఓ ప్రధానమంత్రి ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కాదని, ఇంతటి మహిమాన్వితమైన, గర్వించదగిన ఘట్టానికి సాక్షిగా ఉండకుండా ప్రతిపక్షాలు తమ బాధ్యతారాహిత్య ప్రవర్తనతో కార్యక్రమాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నాయని యోగీ విమర్శించారు.












Click it and Unblock the Notifications