yogi adityanath : ఓటర్లకు యోగీ థ్యాంక్స్- మోడీ-షా తోడ్పాటు వల్లే-అభివృద్ధితోనే ముందుకు..
యూపీలో బీజేపీ సరికొత్త అధ్యాయం లిఖించబోతున్న వేళ కాషాయ సంబరాలు మిన్నంటాయి. ఇవాళ వెలువడిన ఫలితాల్లో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో లక్నోలో ఆ పార్ట నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో పాల్గొన్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో యూపీలో మరోసారి అధికారం కైవసం చేసుకున్నామని యోగీ తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి బీజేపీకి చారిత్రక విజయం అందించారని, యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించారని యోగీ పేర్కొన్నారు.
లక్నోలో భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, నేతలు, తన కేబినెట్ సహచరుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజా విజయంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి ఈ విజయం అద్ధం పడుతోందన్నారు. కేంద్రం, ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఇచ్చిన సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని యోగీ తెలిపారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళతామని హామీ ఇచ్చారు.
ఈవీఎంలు ట్యాంపర్ చేశారని కొందరు ప్రచారం చేశారని కానీ అదంతా తప్పని నిరూపించామని యోగీ వెల్లడించారు. 2024లోనూ ఇదే విజయాన్ని పునరావృతం చేస్తామని యోగీ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అభివృద్ధి వైపు మరింత మెరుగ్గా అడుగులు వేస్తామన్నారు. ఇప్పటికే కేంద్రంతో కలిసి యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్.. అభివృద్ధి పథంలో కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ శాంతి భద్రతలు, సుపరిపాలన, అభివృద్ధి కోసమే శ్రమిస్తామని యోగీ ఆదిత్యనాథ్ బీజేపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.