25న యోగీ ప్రమాణ స్వీకారం - ప్రధాని మోదీ హాజరు : ప్రతిపక్షాలకు ఆహ్వానం..!!
దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ కలిగించిన ఉత్తర ప్రదేశ్ లో మరోసారి యోగి ప్రభుత్వం కొలువు తీరనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా వరుసగా రెండో సారి అధికారం దక్కించుకున్న బీజేపీ మరో అయిదేళ్లు పవర్ లో కొనసాగనుంది. ఇందు కోసం యోగీ.2 ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 25వ తేదీన లక్నోలో యోగి ఆధిత్యనాద్ యూపీ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీలో బీజేపీ 255 సీట్లు గెలవగా.. మిత్రపక్షాలతో కలిసి 273 స్థానాల్లో విజయం సాధించింది. 1987 తరువాత అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలవటం ఇదే ప్రధమం. ప్రధాన ప్రత్యర్ధి అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 111 స్థానాలు గెలుచుకోగా.. మిత్రపక్షాలతో కలిసి 125 సీట్లు దక్కించుకున్నారు.
కాగా, కాంగ్రెస్ రెండు సీట్లు.. బీఎస్పీ ఒక్క స్థానానికే పరిమితం అయ్యాయి. యూపీ ఫలితాల తరువాత యోగీ ఢిల్లీలో ప్రధాని మోదీతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఆ తరువాత అమిత్ షా.. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోనూ భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు...మిత్ర పక్షాలకు ప్రాధాన్యత వంటి అంశాల పైన చర్చించారు.
ఇక, యోగీ రెండో సారి ప్రమాణ స్వీకారం ఈ నెల 25న లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయ్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరగనుంది. 50 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 200 మంది వీవీఐపీలు రానున్నారు. ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా.. నడ్డా.. పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు.
అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. యోగీ ప్రభుత్వంలోని పధకాల లబ్దిదారులను ఈ ప్రమాణ స్వీకారానిని ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్ నాద్ సింగ్.. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరు అవుతారని సమాచారం. డబుల్ ఇంజన్ తో యూపీలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ... రాష్ట్రంలో సురక్ష పాలన అందిస్తామని ఎన్నికల వేళ బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేసారు.
తొలి విడత ప్రభుత్వంలో యోగీ ప్రధానంగా శాంతి భద్రతల అంశం పైన పోలీసులకు స్వేఛ్చ ఇచ్చారు. రెండో విడతలోనూ లా అండ్ ఆర్డర్ అంశంలో యోగీ ఇదే విధానం కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటుగా.. సురక్ష - సుభిక్ష పాలన నినాదం అమలు చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, మిత్రపక్ష పార్టీల సభ్యులకు కేబినెట్ లో ప్రాధాన్యత దక్కనుంది. కేబినెట్ రూపకల్పన పైనా ఇప్పటికే యోగీ కసరత్తు ప్రారంభించారు.