సుప్రీంకోర్టు అంటే లెక్కలేదా: మా సహనాన్ని పరీక్షిస్తున్నారు: సీజేఐ ఎన్వీ రమణ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నదొకటిగా ఉందని వ్యాఖ్యానించింది. తాము ఇచ్చే ఆదేశాలటే కేంద్ర ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయినట్టు కనిపిస్తోందని ఘాటుగా విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం, అధికారుల తీరు తమను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
Big Boss Telugu 5: కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా: ఫుల్ లిస్ట్ ఇదే
ట్రైబ్యునల్స్కు ఖాళీగా ఛైర్మన్లు, సభ్యులు..
ఖాళీగా ఉన్న పలు ట్రైబ్యునళ్లకు ఛైర్మన్లు, సభ్యుల నియామకాలకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయకపో్వడం.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది. సోమవారంలోగా ఆయా ఖాళీలను భర్తీ చేస్తామని, ఛైర్మన్లు, సభ్యుల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే విషయంపై ఈ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఆరా తీసింది
సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలో..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వర రావులతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంలో భాగంగా- వాటన్నింటికీ ఛైర్మన్లు/సభ్యులను నియమించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇదివరకు ఆదేశాలను జారీ చేయగా.. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం నియామకాలను చేపడతామని తెలియజేసింది.
ఆదేశాలపై లెక్కలేదా?
ఆ ప్రక్రియను మాత్రం చేపట్టలేదు. దీనిపట్ల చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేనట్టు కనిపిస్తోందని అన్నారు. తాము పదే పదే ఈ విషయాలను కేంద్రానికి చెప్పాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఇందులో అధికారుల పాత్ర అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము ఈ రకంగా సలహాలు ఇవ్వకూడదనే విషయం తమకు తెలుసునని, అయినప్పటికీ తప్పట్లేదని అన్నారు. కొందరు బ్యురోక్రాట్లు సలహాలను ఇచ్చినట్లుగా.. అదే పాత చట్టాన్ని మళ్లీ తమ ముందుకు తెస్తున్నారని చెప్పారు.
బ్యూరోక్రసీ ఇలా ఉంది..
బ్యూరోక్రసీ వ్యవస్థ ఎలా పని చేస్తోందో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. ఇప్పటిదాకా ఎంత మంది ఛైర్మన్లు/సభ్యులను నియమించారు? అంటూ సీజేఐ ఎన్వీ రమణ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడానికి అవకాశం ఉందని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అవే ఆదేశాలు చట్టాలుగా రూపు దాల్చలేవని చెప్పారు.
ఖాళీగా ఉన్న ట్రైబ్యునల్స్..
నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్, వినియోగదారుల ఫోరం, గ్రీన్ ట్రైబ్యునల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్, టెలికమ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రైబ్యునల్, డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ వంటివి అత్యంత కీలకమైనవని.. అవన్నీ సభ్యులు లేకుండా ఎలా పని చేయగలుగుతాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.
వచ్చే వారానికి వాయిదా..
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ట్రైబ్యునల్ను ఇప్పటిదాకా కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. ఇకపై తాము ఈ విషయంలో ఎలాంటి జోక్యాన్ని చేసుకోదలచుకోలేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. వచ్చే సోమవారానికి విచారణను వాయిదా వేస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా నియామకాలు పూర్తి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ తమ ముందుకు రావాలని కోరుకోవట్లేదని ఎన్వీ రమణ చెప్పారు.