పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: కొత్త నిబంధనలతో మరిన్ని వెసులుబాట్లు!
ఈఎంఐ మాత్రమే కాదు డౌన్ పేమెంట్స్ కోసం పీఎఫ్ ఖాతా నుంచే 90శాతం డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సవరణలను ఆర్టికల్-68పేరుతో కొత్తగా జోడించింది.
న్యూఢిల్లీ: పీఎఫ్(ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ శుభవార్త ప్రకటించింది. ఇకనుంచి పీఎఫ్ నుంచే ఈఎంఐ చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇపిఎఫ్ఓ 1952ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ పథకాన్ని సవరించింది.
ఈఎంఐ మాత్రమే కాదు డౌన్ పేమెంట్స్ కోసం పీఎఫ్ ఖాతా నుంచే 90శాతం డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సవరణలను ఆర్టికల్-68పేరుతో కొత్తగా జోడించింది. కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం ఒక ఈపీఎఫ్ ఖాతాదారుడు సహకార లేదా హౌజింగ్ సొసైటీలోని సభ్యులు కనీసం 10మంది తమ పీఎఫ్ ఖాతాల నుంచి 90శాతం ను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇళ్ల నిర్మాణం కోసం ఫ్లాట్ల కొనుగోళ్లు కోసం పీఎఫ్ ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. వీటితో పాటు హౌజింగ్ ఏజెన్సీ, ప్రాథమిక రుణ సంస్థలు, బ్యాంకు రుణాలు, పెండింగ్ వడ్డీలు వంటి చెల్లింపులకు సైతం పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే.. ఖాతాదారుడు కనీసం మూడేళ్లు పీఎఫ్ ఖాతాలో కొనసాగాలి. ఇక జీవిత భాగస్వాములతో కలిసి ఉన్నవారి పీఎఫ్ ఖాతాలలో కనీసం రూ.20వేల కనీస నిల్వ ఉండాలి. మరో నిబంధన ఏంటంటే.. ఈ అవకాశం జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.