ఆ గొంతు నొక్కారు, విభజన పాపం మీదే: కాంగ్రెస్ను దులిపిన ప్రధాని మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ విభజన మొదలు, యూపీయే హయాంలో ప్రధాని మోడీ కేవలం నిమిత్తమాత్రడే అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తామన్నారు. బీజేపీ గెలిస్తే ఆధార్ పక్కన పెట్టేస్తారని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సొంత లాభం కోసం దేశాన్ని విభజన చేసిందన్నారు.
ఇప్పుడు దానిని తాము మరింత శాస్త్రీయంగా వాడుతున్నామని చెప్పారు. నిరుపేదలకు కూడా ఆధార్ ద్వారా మేలు చేయాలని తాము చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మీరే ఆధార్ను వ్యతిరేకిస్తున్నారన్నారు. మీరు తెచ్చిన ఆధార్తో నన్ను ఇరుకున పెట్టాలని చూశారని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో ఎక్కడా అవినీతి జరగడం లేదన్నారు.
యువత ఉద్యోగాల వెంటపడటం లేదు
ఈ మూడేళ్లలో మేం ఎన్నో చేశామని ప్రధాని మోడీ అన్నారు. రోజులు మారాయని, ఇప్పుడు యువత ఉద్యోగాల వెంట పడటం లేదని, వాళ్లు స్టార్టప్లు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని ముద్రా యోజన ఈ మధ్య తరగతి కలలు నెరవేర్చడానికి కృషి చేస్తోందన్నారు. అందుకే రూ.10 లక్షల కోట్ల రుణాల పంపిణీలో ఎక్కడా అవినీతి కనిపించలేదన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారుల్లో 3 కోట్ల మంది మొదటిసారి రుణాలు తీసుకున్నవారే అన్నారు.
వారిది ఎద్దులబండి పాలసీ
21వ శతాబ్దం తమదే అని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఏవియేషన్ పాలసీ అనేది లేదన్నారు. వారిది ఎద్దులబండి పాలసీ అని చెప్పారు. వితంతువులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల పేర్లు చెప్పి ప్రభుత్వ సొమ్మును మీ సర్కార్ దోచేసిందన్నారు. చిన్న పట్టణాలకు అద్భుతమైన విమానాశ్రయాలు తెచ్చామన్నారు. దేశానికి రెక్కలు తొడిగామన్నారు.
మేం చేయగలిగిందే చెబుతాం
తాము చేయగలిగే పనులు మాత్రమే చెబుతామని నరేంద్ర మోడీ అన్నారు. అబద్దాలు చెప్పి జనం నోళ్లలో మట్టి కొట్టమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చివరి మూడేళ్లలో 2వేల కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి చేస్తే తాము ఈ నాలుగేళ్లలోనే 4వేల 3 వందల కిలోమీటర్ల రైల్వే లైన్లు పూర్తి చేసిందన్నారు. మల్లికార్జున ఖర్గే చేస్తు్నన బీదర్ - కల్బుర్గి రైల్వే మార్గాన్ని వాజపేయి ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, కానీ ఆయన రైల్వే మంత్రిగా ఉండి పట్టించుకోలేదన్నారు. కానీ తాము దానిని పూర్తి చేశామన్నారు. అది పార్లమెంటులో ప్రతిపక్ష నేత నియోజకవర్గం కదా అని తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటే గొంతు నొక్కేశారు
దేశం ఈనాడు ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పారు. మొన్న కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ఓ యువకుడు ముందుకు వచ్చాడని, కానీ అతని గొంతు నొక్కేశారన్నారు. మీరు ఎన్నికల కోసం శంకుస్థాపన రాళ్లు వేస్తారని, మీ పేర్లు వాటిపై రాసుకుంటారని మోడీ ఎద్దేవా చేశారు. మీరు చివరి మూడేళ్లలో చేసిన అభివృద్ధికి ఎన్నో రెట్లు మేం చేశామని చెప్పారు. పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ పేరుకే ప్రధానమంత్రి అన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రభుత్వం తమదే అన్నారు.
దేశం శాశ్వతం, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అంగీకరించాం
కాంగ్రెస్ ఎప్పుడూ ఒక కుటుంబం కోసం పని చేసిందని, కానీ అది సరికాదని మోడీ అన్నారు. పార్టీలు శాశ్వతం కాదని, దేశం శాశ్వతం అన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ బాగా పాలించి ఉంటే దేశం ఈ దుస్థితిలో ఉండి ఉండేది కాదన్నారు. దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అంగీకరించింది తామే అన్నారు.
స్కాంలు చేసిన వారిని వదలం, పన్నుఎగవేత లేదు
కుంభకోణాలు చేసిన వారిని వదిలేది లేదన్నారు. బ్యాంకులకు వేలకోట్ల ఎగవేతలు కాంగ్రెస్ చేసిన పాపమే అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క పన్ను ఎగవేత జరుగుతోందా అన్నారు. అవినీతిపరులను జైలుకు పంపే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. పన్ను ఎగవేతదారులకు మేం డబ్బివ్వలేదన్నారు. కాంగ్రెస్ పాలన వల్లే మొండి బకాయిలు అన్నారు. తాము నల్లధనాన్ని బయటకు తెచ్చి తీరుతామన్నారు. కాంగ్రెస్ ఎగవేత దారులను కాపాడుతూ వచ్చిందని ఆరోపించారు.