డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారా - వినేది లేదు.. రక్తం లాగుడే..!!
తాగి బండి డ్రైవ్ చేస్తూ కనిపిస్తే ఇక అంతే సంగతులు. తాగి డ్రైవ్ చేయద్దని ఎంత చెప్పినా చాలా మంది వినిపించుకోవటం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో జరిమానాలు విధించినా తీరు మారటం లేదు. దీంతో.. పంజాబ్ పోలీసులు కొత్త విధానం తీసుకొచ్చారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటే మినహా ఈ తాగి బండి నడిపే వారిని నియంత్రించలేమనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా.. ఇక తాగి బండి ముట్టుకోవాలంటే ఏ రకంగా సిద్దం కావాలో కొత్త ప్రతిపాదనలు ప్రకటించింది. పోలీసులను ప్రతిపాదనలకు ప్రభుత్వం సైతం ఆమోద ముద్ర వేసింది. ఈ కొత్త నిర్ణయాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో మందు కొట్టి పట్టుబడితే.. రక్త దానం చేయాల్సిందే. లేకుంటే ఆప్షన్లు ఇచ్చారు. తాగి దొరికిపోతే వీటిలో ఏదో ఒకటి చేయాల్సిందే.
సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు రోగులకు సేవ చేయాలి. తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. మందు కొట్టి దొరికిపోయిన వారు తప్పనిసరిగా రక్త దానం చేయాల్సిందేనంటూ తాజా నిబంధనల్లో స్పష్టం చేసారు. అది సాధ్యపడకుంటే.. సమీపంలోని ఆసుపత్రిలో కొన్ని గంటలు సేవ చేయాలి. దానికి సిద్దపడకపోతే.. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని తాజా ఉత్తర్వుల్లో తేల్చి చెప్పారు. దీంతో పాటుగా..రవాణా శాఖ నుంచి రీఫ్రెస్ కోర్స్ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. అంతటితో ఆగలేదు. ట్రాఫిక్ రూల్స్ లోనూ మార్పులు చేసారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్స్ను మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు.
అందులో ఓవర్ స్పీడ్, వాహనం నడుపుతూ మొబైల్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్లు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండేలా మార్పులు చేసారు. ఒక వేల రెండోసారి దొరికితే రెండింతల ఫైన్ కట్టాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా.. మొబైల్ వాడినా రూ.5వేల జరిమానా చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేసారు. రెండోసారి రిపీట్ అయితే, అది డబుల్ అవుతుందని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో..ఇక, తాగి బండి నడిపే వాళ్లు ఇవన్నీ చూసిన తరువాత.. ఇప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.