11 అంతస్తుల నుంచి దూకి యువతి ఆత్మహత్య
బెంగళూరు: ప్రియుడు దూరం అయ్యాడని జీవితంపై విరక్తి చెందిన యువతి 11 అంతస్తుల నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని బ్యాటరాయణపురలో నివాసం ఉంటున్న పూజా (21) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
కస్తూరి బా రోడ్డులోని ప్రిస్టేజ్ ఒబేలిస్క్ కట్టడంలోని బాబా జాన్స్ కంపెనీలో పూజా ఉద్యోగం చేస్తున్నది. ఇదే కంపెనీలో హుణసమారనహళ్ళికి చెందిన చరణ్ ఉద్యోగం చేసేవాడు. పూజా, చరణ్ ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు.
పెద్దలకు చెప్పి వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈనెల 5వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన చరణ్ మరణించాడు. ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పూజా షాక్ కు గురైయ్యింది.
సాటి ఉద్యోగులు పూజాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. సోమవారం పూజా ఉద్యోగానికి వెళ్లింది. తరువాత మద్యాహ్నం సాటి ఉద్యోగులతో మాట్లాడింది. చివరికి ఓ డెత్ నోట్ వ్రాసి పెట్టి 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న కబ్బన్ పార్క్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూజా వ్రాసిన డెత్ నోట్, ఆమె మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెత్ నోట్ లో పూజా తన అవేదన వ్యక్తం చేసింది.
తాను ఆత్మహత్య చేసుకోవడం తప్పే, అయితే తనకు చాల సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తట్టుకోలేకపోతున్నానని, చరణ్ లేని జీవితం తనకు వద్దని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా, తనను అందరూ క్షమించాలని వ్రాసి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.