యువకుడి ప్రాణం తీసిన ముఖ్యమంత్రి కాన్వాయ్
భోపాల్: ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోందని అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. మంగళవారం ఉదయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విధాన సభకు వెళుతుండగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి సీఎం కాన్వాయ్కి దారి ఇస్తూ, ట్రాఫిక్ నిలిపివేశారు.
ఆ సమయంలో రోడ్డు దాటుతున్న 22ఏళ్ల విద్యార్థిని బస్సు ఢీకొంది. యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించకుండా సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు రోడ్డు పక్కనే వదిలేశారు.
కాన్వాయ్ వెళ్లాక తీరిగ్గా ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి చేరుకునే సరికి అక్కడ వైద్య పరికరాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. 20 నిమిషాలు వేచిచూశాక యువకుడిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు.
కాగా, అక్కడికి తీసుకెళ్లిన కాసేపటికే యువకుడు మరణించాడు. తీవ్ర రక్తస్రావమై సమయానికి చికిత్స అందకపోయేసరికి ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. కళ్లముందే కన్న కొడుకు మృతి చెందడంతో యువకుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు, ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని యువకుడి బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు.