లోకసభ సభ్యత్వంపై స్పీకర్కు వైసీపీ, వ్యూహాత్మకంగా కొత్తపల్లి గీత
న్యూఢిల్లీ: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాయనున్నది. గీత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేసేందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా లేఖకు జత చేసి పంపించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.
త్వరలోనే లేఖను స్పీకర్కు పంపిస్తామని వైసీపీ చెబుతోంది. కొత్తపల్లి గీత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీడీపీతో కలిసి పని చేస్తున్నారని వారు తమ లేఖలో ఫిర్యాదు చేయనున్నారు. అధినాయకత్వం ఆదేశాలను ధిక్కరించటంతో పాటు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని వారంటున్నారు.

లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ పంపించే ముందు కొత్తపల్లి గీతను పార్టీ పదవుల నుండి తొలగించనున్నారు. కొత్తపల్లి గీత ప్రస్తుతం లోకసభలో పార్టీ పక్షం ఉపనాయకురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు.
మరోవైపు, కొత్తపల్లి గీత షెడ్యూల్డు తెగలకు చెందినట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారంటూ ఆమెపై కేసు దాఖలు చేయటం తెలిసిందే. అయితే, గీత వైసీపీ అధినాయకత్వం వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు పైయెత్తులు వేస్తున్నారు. ఆమె పలువురు లోకసభ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తనను వేధింపులకు గురి చేస్తోందని ఆమె ఇది వరకే లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటంతోపాటు ఈ అంశంపై ఆమె అన్ని పార్టీల నాయకులు, ఎంపీలకులేఖలు రాశారు.












Click it and Unblock the Notifications