ఓడకు నిప్పు: ఒకరు మృతి, సంద్రంలో చిక్కుపడిన వందలాది మంది
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడలో మంటలు లేచి ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఊకరు మరణించగా, వందలాది మంది చిక్కుపడిపోయారు. మధ్యధరా సముద్రంలో ఓడలో గ్రీసు దేశంలోని పట్రాస్ పోర్టు నుంచి ఇటలీలోని అంకోనాకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో 423 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. వారితోపాటు 222 కార్లు కూడా ఉన్నాయి. ఓడలోని చాలా మంది గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఓడ కింది భాగంలోని కార్లు ఉన్న డెక్లో ఒకదాని వెంట మరొకటిగా పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే మంటలు లేచాయి. దాంతో హాహాకారాలు మిన్నుముట్టాయి.
ఓడపై ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఓడలో లైఫ్ బోట్లు ఉన్నాయి గానీ వాటిపై ప్రయాణించి సమీపంలోని ఒడ్డుకు చేరుకుందామనుకుంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం మధ్యలో కూడా అలలు అంతెత్తున ఎగసి పడుతున్నాయి. ఇటలీకి చెందిన ‘నార్మన్ అట్లాంటిక్' అనే ఓడలో ప్రయాణిస్తున్న 478 మంది తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వారంతా అత్యంత విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించారు. తొలిదశలో 131 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత వాతావరణం సహకరించడం లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో లైఫ్ బోట్లతో ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. వాతావరణం సహకరించక విమానాలు వెళ్లలేని దుస్థితి. మధ్యలో, పెనుగాలులు వీస్తుండడంతో ఓడలో మంటలు క్షణక్షణానికి ఎగసిపడుతున్నాయి. దాదాపు 300 మంది వరకూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తుది వార్తలు అందే వరకూ ఓడలో ఒకరు మరణించారు.
తీవ్రమైన వ్యతిరేక పరిస్థితుల్లోనే ఎలాగోలా సాహసం చేసి ఒక లైఫ్ బోటును బయటకు తీశారు. దానిలో 150 మంది ఎక్కవచ్చు. కానీ, 35 మందిని మాత్రమే సమీపంలోని సమీపంలోని కంటెయినర్ షిప్లోకి తరలించగలిగారు. అలాగే, సహాయ చర్యల్లో భాగంగా అధికారులు పంపించిన బోటులో మరో 56 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. అటు హెలికాప్టర్లలో ఇటు బోట్లలో 222 మంది బయటకు రాగా 256 మంది మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఆదివారం ఉదయం నుంచి చీకటి పడే వరకూ దాదాపు 131 మందిని తరలించాయి. భారీ వర్షాలు సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నాయని, చీకటి పడిపోవడం, వాతావరణం బాగా లేకపోవడంతో సహాయ కార్యక్రమాలను నిలిపి వేశామని కోస్ట్గార్డ్ అధి కార ప్రతినిధి నికోస్ లగ్కాడియోనోస్ తెలిపారు. వర్షాల కారణంగా మంటలు కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఎగసిపడుతూనే ఉన్నాయని వివరించారు. రెండు టగ్ బోట్లు నిప్పును ఆర్పే పనిలో ఉన్నాయన్నారు.