ఐఎస్: సిరియాకు 100మంది పాక్ యువతీయువకులు
లాహోర్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు కొందరు యువతి, మహిళలతో సహా వంద మంది పాకిస్థానీయులు ఇరాక్, సిరియాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రాణా సనుల్లా ఈ విషయమై మాట్లాడుతూ.. ఐఎస్ కోసం పాకిస్థాన్లో జరుగుతున్న రిక్రూట్మెంట్లను ఆపేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయంలో ఒక బృందానికి చెందిన ఎనిమిది మందిని అక్కడి సియాల్కోట్ జిల్లాలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారు జమాతుద్ దవా సంస్థకు చెందిన వారని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్కు తమ దేశంలో పట్టు దొరకనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఇలా ఐసిస్తో సంబంధం ఉన్న 40 మందిని తమ దేశంలో అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని తాము సహించబోమని అక్కడి మంత్రులు, అధికారులు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.