వాషింగ్టన్ నేవీ యార్డులో కాల్పులు: 13 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ నేవీ యార్డ్లో ముగ్గురు సాయుధులు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకతను మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. సోమవారం ఉదయం 8.20 గంటల సమయంలో నేవల్ సీ సిస్టమ్స్ కమాండ్ హెడ్క్వార్టర్స్లో చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే ఈ అగంతకుల్లో ఒకరి పోలీసులు కాల్చి చంపారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
కాల్పుల్లో పన్నెండు మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని కెప్టెన్ ఎడ్ బక్లాటిన్ చెప్పారు. సంఘటన అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు హెలికాప్టర్ ద్వారా ఒక జవానును అగంతకుడు దాగిన భవనంపైన దింపారు. పలు పోలీసు వాహనాలు ఆ బిల్డింగ్ను చుట్టుముట్టాయి. స్వాట్ బృందం కూడా రంగంలోకి దిగింది. ఆ అగంతుకులు మిలటరీ యూనీఫాం ధరించి యార్డ్లోకి చొరబడ్డారని పోలీసు అధికారి క్రిస్ కెల్లీ తెలిపారు. వీళ్ల వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని ఆ అధికారి తెలిపారు.
కాల్పులు ప్రారంభమైన తర్వాత మూడు వేల మందికి పైగా పనిచేసే యార్డ్లో గందరగోళం నెలకొందని, ప్రాణాలు రక్షించుకోడానికి అందరూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఎదురు కాల్పుల్లో మరణించిన దుండగుడ్ని ఆరోన్ ఆలెక్సిస్గా గుర్తించారు. 34 ఏళ్ల అతను టెక్సాస్లోని ఫోర్త్ వర్త్కు చెందినవాడు. అతను 2007 నుంచి 2011 వరకు నేవీలో పనిచేశాడని చెబుతున్నారు.
కాల్పుల సంఘటన అనంతరం అధ్యక్షుడు ఒబామా సంఘటన వివరాలు వెల్లడించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గాయపడిన వారిలో పోలీసు అధికారి కూడా ఉన్నారని తెలిసింది. ఈ యార్డ్లో అమెరికా నేవీకి కావాల్సిన ఓడలను, జలాంతర్గాములను తయారు చేయడంలో పాటు కొనడం, నిర్వహించడం లాంటి పనులు చేస్తారు. అతి పురాతనమైన యార్డ్ల్లో ఇది ఒకటి. దీనిని 1799లో అనకోస్టియా నది ఒడ్డున నిర్మించారు.