పహల్గామ్పై పాకిస్తాన్ మంత్రి తాటాకు చప్పుళ్లు
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తమ చర్య కాదని నిరూపించుకునే పనిలో పడింది. తాము పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు, మిలిటెంట్ గ్రూపులే పహల్గామ్ నరమేధానికి పాల్పడ్డాయంటూ భారత్ పదే పదే చెబుతోండటాన్ని తప్పు పట్టింది.

పహల్గామ్ ఉగ్రదాడిపై తటస్థ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని కకుల్లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
స్వయానా పాకిస్తాన్ ప్రధాన మంత్రి దర్యాప్తు మాట ఎత్తుతోండగా.. ఆయన కేబినెట్ మంత్రి ఒకరు బెదిరింపులకు దిగారు. భారత్ను హెచ్చరించారు. ఇండస్ రివర్ ట్రీటీ కింద తమ దేశానికి రావాల్సిన వాటా నీటిని నిలిపివేస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ అన్నారు.
తమ వద్ద 130 న్యూక్లియర్ వార్ హెడ్ మిస్సైళ్లు ఉన్నాయని, వాటిని తాము అలంకరించుకోవడానికి రూపొందించలేదని అన్నారు. భారత్పై ప్రయోగించడానికి మాత్రమే వాటిని తయారు చేశామని చెప్పారు. వాటిని ప్రయోగించాల్సి వస్తే భారత్పై సంధిస్తామంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.
ఘోరీ, షహీన్, ఘజ్నవి వంటి 130 న్యూక్లియర్ వార్ హెడ్ మిస్సైళ్లు తమ వద్ద ఉన్నాయని హనీఫ్ అబ్బాసీ చెప్పారు. తమ నీటిని నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సన్నద్ధం కావాల్సి ఉంటుందని అన్నారు. న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణులను తాము ఎక్కడ దాచామనేది ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.
భారత విమానాల రాకపోకల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడాన్ని హనీఫ్ అబ్బాసీ సమర్థించుకున్నారు. తమ గగనతలాన్ని మూసివేయడం వల్ల రెండు రోజుల్లోనే భారత పౌర విమానయాన రంగం తీవ్ర గందరగోళంలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇంకో 10 రోజులు ఇలాగే కొనసాగితే, భారత పౌర విమానయాన సంస్థలు దివాళా తీస్తాయని వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ తన భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్పై నిందలు మోపడం ఎంత మాత్రం సరికాదని హనీఫ్ అబ్బాసీ ఆరోపించారు. వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలంటూ భారత్ తీసుకున్న నిర్ణయం తర్వాత తాము ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు.
"Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6
— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025












Click it and Unblock the Notifications