ఉక్రెయిన్ చేతిలో 14 వేల మంది రష్యా సైనికులు మృతి.. రంగంలోకి అమెరికా స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లు..!
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. పట్టణాల్లోని నివాస భవనాలు , పాఠశాలను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్ లోని మెరెపాలోని ఓ కమ్యూనిటీ సెంటర్ తో పాటు పాఠశాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందినట్లు అదికారులు తెలిపారు. ఒకవైపు రష్యా సేనలు విరుచుపుడుతున్నా .. వారిని సమర్థవంతంగా ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్నాయి. ప్రతిదాడులతో వారిని మట్టుపెడుతున్నాయి.
రష్యా సైనికులు హతం
ఈ యుద్ధపోరులో ఇరుదేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన 14వేల మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అంతే కాకుండా 444 యుద్ధ ట్యాంకులు, 1, 435 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అటు 108 హెలికాప్టర్లు, 86 యుద్ధ విమానాలు, 11 యూఏవీలను తమ సైన్యం నేలకూల్చాయిని చెప్పారు. వీటితో పాటు అదనంగా 43 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను , మూడు నౌకలను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటించేందుకు తమకు యుద్ధ విమానాలను అమెరికా, ఐరోపా దేశాలు అదించాలని కోరింది.
అమెరికా స్విచ్ బ్లేడ్ ఆత్మహుతి డ్రోన్లు
ఉక్రెయిన్ కు అవసరమైన సైనిక , ఆర్థిక సాయాన్ని అందిస్తామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఇందులో భాగంగా స్విచ్ బ్లేడ్ ఆత్మహుతి డ్రోన్లను అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా అందిస్తున్న ఈ డ్రోన్ల ద్వారా రష్యా సైనిక వాహనాల కదలికలను , కాన్వాయ్ లను దెబ్బ తీయవచ్చని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. సైనిక సాయాన్ని చేస్తున్న అమెరికాకు ఉక్రెయిన్ కృతజ్ఞతలు తెలిపింది. అటు తాము మూడో ప్రపంచ యుద్దాన్ని కోరుకోవడం లేదని అమెరికా మరో సారి స్పష్టం చేసింది.
నో ప్లె జోన్ కు లిథువేనియా పిలుపు
తమ గగనతలాన్ని నో ఫ్లె జోన్ గా ప్రకటించాలని ఇప్పటికే అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ఆయా దేశాలు నిరాకిస్తూ వస్తున్నాయి. కానీ తాజాగా ఉక్రెయిన్ గగనతలంపై నో ఫ్లై జోన్ కోసం పిలుపునిస్తూ లిథువేనియా పార్లమెంటు తీర్మానం చేసింది. దీనిని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. అటు ఇప్పటికే స్లొవేనియా, ఎస్తానియా దేశాలు నో ప్లె జోన్ కు పిలుపునిచ్చాయి.