నో రిజిస్ట్రేషన్.. నేరుగా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్.. కేంద్రం కీలక ప్రకటన
కరోనా వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
ఈ వెసులుబాటు ద్వారా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరింత ఊపందుకుంటుందని కేంద్రం భావిస్తోంది. దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అత్యధిక సంఖ్యలో ఉన్నందున, తాజా వ్యాక్సినేషన్ డ్రైవ్ తో అత్యధిక శాతం మంది టీకాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కొన్నిచోట్ల వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో తీవ్ర విముఖత కనిపిస్తుండడం ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.